భారత్ కు సహకరించండి: పాక్ కు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యాకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల వివరాలు వెల్లడించాలని అమెరికా సూచించింది. తాలిబన్ ఉగ్రవాద సంస్థతో పాటు మిలిగిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అది పాకిస్థాన్ కే ముప్పు అని అమెరికా చెప్పింది.
ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ ను అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్ పర్సన్ మార్క్ టోనర్ హెచ్చరించారు. 26/11 దాడుల కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరించాలని పాకిస్థాన్ కు సూచించారు. భారత్ అధికారులకు ముంబై దాడుల కేసులో పూర్తిగా సహకరించాలని గతంలోనే తాము పాక్ కు సూచించామని మార్క్ టోనర్ గుర్తు చేశారు.
పాకిస్థాన్ తన పద్దతి మార్చుకోకుండా ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చి వారిని ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన మీడియాకు చెప్పారు. ఇప్పటికే పాక్ లో పలువురు ఉగ్రవాద సంస్థల నాయకులు, ఉగ్రవాదులు అంతం అయ్యారని, అయినా తమకు ఏమి తెలీదని పాక్ పాతపాట పాడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.