అందుకే చైనాను వదిలి భారత్ ను టార్గెట్ చేశాం.! అసలు విషయం చెప్పిన అమెరికా..
రష్యా నుంచి చమురు కొంటూ ఉక్రెయిన్ పై యుద్దానికి ఆ దేశానికి పరోక్షంగా సాయపడుతున్నారన్న కారణం చూపుతూ భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ పై ఉరుముతున్న అమెరికా.. సుంకాల విషయానికి వచ్చేసరికి భారత్ ను మాత్రమే టార్గెట్ చేసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపుతారా లేదా అంటూ హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ వెనక్కి తగ్గకపోయే సరికి ఏకంగా 50 శాతం అదనపు సుంకాలు విధించేశారు. ఇలా చైనాను వదిలేసి భారత్ పైనే సుంకాల మోత మోగించడాన్ని ఇవాళ అమెరికా సమర్ధించుకుంది.
రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల్లో ఒకటైన చైనాను వదిలేసి కేవలం భారత్ పైనే సుంకాల మోత మోగించడంపై స్పందించిన అమెరికా మంత్రి మార్కో రూబియో క్లారిటీ ఇచ్చారు. రష్యా చమురును శుద్ధి చేసినందుకు చైనాపై ద్వితీయ ఆంక్షలు విధించడం వల్ల ప్రపంచ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంగీకరంచారు.

నిన్న ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కో రూబియో.. చైనా శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ చమురు మార్కెట్కు విఘాతకరమైన పరిణామాలను కలిగిస్తుందని హెచ్చరించారు. చైనా తాము రష్యా నుంచి కొనుగోలు చేసే చమురును శుద్ధి చేసి తిరిగి ప్రపంచ మార్కెట్ కు అందిస్తుందని, కానీ భారత్ అలా కాదని, వారే స్వయంగా వాడుకుంటున్నారని రూబియో వెల్లడించారు. చైనా నుంచి చమురు కొనుగోలు చేసే వారు అధిక ధర చెల్లించాలని, అది అందుబాటులో లేకపోతే మాత్రం ప్రత్యామ్నాయ వనరులు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు.

వాస్తవానికి యూరోపియన్ దేశాలు ఇప్పటికే చైనా, భారత్ రెండింటిపైనా 100 శాతం సుంకాలు విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయని రూబియో తెలిపారు. అలాగే రష్యా చమురును భారత్ నిరాటంకంగా కొనుగోలు చేయడం ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ ప్రయత్నాలను నిలబెట్టేందుకు పనికొస్తుందన్నారు. దీనిపై అమెరికా తీవ్ర అసంతృప్తితో ఉందని రూబియో వెల్లడించారు. అందుకే ఈ సుంకాల మోత తప్పలేదన్నారు. కానీ భారత్ వీటికి లొంగకపోవడంతో అమెరికా ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తోంది.












Click it and Unblock the Notifications