ట్విట్టర్ లో వన్ వర్డ్ ట్రెండ్-పాల్గొన్న ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ-ఏం పోస్ట్ చేశారో తెలుసా ?
గత కొన్ని రోజులుగా ట్విట్టర్లో వన్-వర్డ్ పోస్ట్ల సందడి కొనసాగుతోంది. ట్విట్టర్ లో మీకు నచ్చిన ఒకే ఒక్క పదాన్ని పోస్ట్ చేయడమే ఈ ట్రెండ్. యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ నుండి డామినోస్, స్టార్బక్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల వరకు, ఈ మైక్రో-బ్లాగింగ్ సైట్ వన్ వర్డ్ ట్వీట్లతో నిండిపోయింది. ఇప్పుడు ఉక్రేనియన్ అధినేత వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఈ వన్ వర్డ్ ట్రెండ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం తన స్వదేశం ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో ఆన చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై దాడికి ఆదేశించి నెలలు గడుస్తోంది. ఉక్రెయిన్ లో ఇళ్ల ధ్వంసం, ఉద్యోగాలు పోవడంతో, దేశంలోని పౌరులు శరణార్థులుగా మారిపోయారు. ఉక్రెయిన్ లో షాకింగ్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి బాధాకరమైన పరిస్ధితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన వన్-వర్డ్ ట్వీట్ పంచుకోవడానికి ట్విట్టర్ ను ఆశ్రయించారు. ఇంతకీ ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే ఎలాంటివారైనా స్పందించక మానరు.
ఇంతకీ జెలెన్ స్కీ పెట్టిన ఆ ట్వీట్ ఫ్రీడం (స్వాతంత్ర్యం). రష్యా దాడులతో తాము కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి కావాలనే అర్ధం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెట్టినప్పటి నుంచి పోస్ట్కి 175k పైగా లైక్లు, టన్నుల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ప్రజలు కూడా ఈ ట్వీట్ను మెచ్చుకున్నారు. ఉక్రెయిన్కు తమ సంఘీభావాన్ని పంచుకున్నారు. దేశంలో శాంతి నెలకొనాలని చాలా మంది ప్రార్థించారు. నేషనల్ రైల్రోడ్ ప్యాసింజర్ కార్పొరేషన్ అని కూడా పిలిచే ఆమ్ట్రాక్ చేసిన ట్వీట్ వన్-వర్డ్ ట్వీట్ ట్రెండ్ను ప్రారంభించిందని భావిస్తున్నారు. ఆమ్ట్రాక్ అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్ సాధారణ పదం- "రైళ్లు" అని ట్వీట్ చేసింది. దీంతో ఆ తర్వాత నెటిజన్లు ట్వీట్ల వర్షం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు ట్విట్టర్ నిత్యం లక్షల వన్ వర్డ్ ట్వీట్లతో నిండిపోతోంది.