అమెరికాలో సిక్కు యువతిపై.. ఓ శ్వేతజాతీయుడి జాత్యహంకారం
అమెరికాలోని మన్ హట్టన్ లో మళ్లీ ఇటీవల ఓ సిక్కు-అమెరికన్ అమ్మాయిపై ఓ శ్వేతజాతీయుడు తన జాతి విద్వేష పైత్యాన్ని వెళ్లగక్కాడు.
దక్షిణాసియా వాసులపై అమెరికాలో విద్వేష నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల మన్ హట్టన్ లో మళ్లీ ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకకు వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై ఓ శ్వేతజాతీయుడు తన జాత్యహంకారాన్ని ప్రదర్శించాడు.
సిక్కు-అమెరికన్ అమ్మాయి రాజ్ ప్రీత్ హేర్ ఇటీవల సబ్ వే రైలులో ప్రయాణిస్తున్నసమయంలో ఓ శ్వేతజాతీయుడు తన జాతి విద్వేష పైత్యాన్ని వెళ్లగక్కాడు. ఆమెను చూసి మధ్యప్రాచ్యపు యువతిగా భావించిన అతడు ''నువ్వు ఈ దేశానికి చెందినదానివి కావు.. తిరిగి లెబనాన్ వెళ్లిపో..'' అంటూ కేకలు వేశాడు.
రైలులో ప్రయాణిస్తూ తాను తన మొబైల్ ఫోన్ చూస్తుండగా ఓ శ్వేతజాతీయుడు తన వద్దకు వచ్చి అరవడం మొదలెట్టాడని, తనను ఉద్దేశించి పరుషమైన, తీవ్ర పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశాడని రాజ్ ప్రీత్ హేర్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ సమయంలో తానెదుర్కొన్న భయానక అనుభవం గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే 'దిస్ వీక్ ఇన్ హేట్'లో ఆమె వివరించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తరువాత దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్వేష నేరాలను ఈ కాలమ్ కింద న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రచురిస్తోంది.