రవిచంద్రన్ అశ్విన్: 413 టెస్టు వికెట్లు తీసినా తుది జట్టులో ఎందుకు ఆడించడం లేదు? - INDvsENG
'ఇది పిచ్చితనం'. 'నేను నమ్మలేకపోతున్నాను'. 'చాలా విచిత్రమైన నిర్ణయం'.. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఎందుకిలా జరుగుతోంది?
ఈ వ్యాఖ్యలు ప్రపంచంలోని మాజీ క్రికెటర్లు చేసినవి. వీరు ఇలా కామెంట్ చేయడానికి సరైన కారణం కూడా ఉంది.
ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ర్యాంకింగ్స్లో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అయినా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగు టెస్ట్ల మ్యాచ్ తుది జట్టు 11 మందిలో చోటు దక్కలేదు.
34 ఏళ్ల అశ్విన్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో 413 వికెట్లు తీశాడు. చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆయన కంటే 14 మంది ఆటగాళ్లు మాత్రమే అధికంగా టెస్ట్ వికెట్లు తీశారు. ఇంతమంచి రికార్డు ఉన్నా, ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్లలో కనీసం ఒక్కదానిలో కూడా ఆడే అవకాశం లభించలేదు.
ఆరునెలల కిందట స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 3-1తో గెలుచుకుంది. ఈ సిరీస్ లో 14.71 సగటుతో 32 వికెట్లు తీసుకుని భారత్ విజయంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.
https://twitter.com/MichaelVaughan/status/1433361974247710722
మాజీ క్రికెటర్ల స్పందన ఏంటి?
అశ్విన్కు అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయంతో "నేను షాక్ అయ్యాను" అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పేర్కొన్నారు. ''అశ్విన్ ని నాలుగు టెస్టుల్లో తుది జట్టులో ఆడించకపోవడం అనేది, యూకేలో ఇప్పటి వరకు జరిగిన మిగతా టెస్ట్ మ్యాచ్ లలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చూడలేదు. టెస్ట్ మ్యాచ్లలో 413 వికెట్లు తీసి, 5 సెంచరీలు కూడా చేసిన ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పిచ్చితనంలాంటిది'' అని మైఖేల్ వాన్ ట్విటర్ లో పేర్కొన్నారు.
"నేను నమ్మలేకపోతున్నాను. మీరు ప్రపంచ నంబర్ టూ బౌలర్ని నాలుగు టెస్ట్ మ్యాచ్లలో హాఫ్ ప్యాంటు, టీ కప్పుతో ఎలా కూర్చోబెడతారు?" అని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఫిల్ టుఫ్నెల్ పేర్కొన్నారు.
నాలుగింటిలో ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ లోనైనా ఆయన్ని ఆడించొచ్చు.
"ఓవల్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ ని ఇందులో ఏదో ఒక విధంగా ఆడించాల్సింది" అని భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా తెలిపారు.
ఎక్స్ ఫ్యాక్టర్ అయ్యే సమర్ధత అశ్విన్ కు ఉందని ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్మన్ మార్క్ రాంప్రకాష్ అన్నారు.
అశ్విన్ ని ఎంపిక చేయకపోవడం విచిత్రమైన నిర్ణయంగా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్మన్ ఎబోనీ రెన్ఫోర్డ్-బ్రెంట్ అభివర్ణించారు.
https://twitter.com/juniorwaugh349/status/1433364522341842945
ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. మైఖేల్ వాన్ ట్వీట్కు ప్రతిస్పందనగా, మార్క్ వా కామెంట్ చేశారు. ''భారతీయ మేధావుల దగ్గర దీనికి ఏదైనా క్లూ ఉంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ''ఇదో అర్థం కాని విషయం'' అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించి పోస్ట్ చేశారు.
- 'సచిన్ అందరికీ క్రికెట్ దేవుడు... కానీ, నాకు మాత్రం కొడుకులాంటి వాడు'
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
తుది జట్టులోకి అశ్విన్ని భారత్ ఎందుకు తీసుకోలేదు
భారత జట్టులో చాలా మంది బౌలర్లు ఉండటం, అశ్విన్ బ్యాటింగ్ చేయలేకపోవడమే కారణమా?
అయితే దీని గురించి మరోసారి ఆలోచించాలి. అశ్విన్ టెస్టుల్లో మొత్తం ఐదు సెంచరీలు చేశాడు. వీటిలో, ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్పై ఓ సెంచరీ చేశాడు.
ఈ ఏడాది జూన్లో సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అశ్విన్ 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 2016 నుంచి ఆసియా వెలుపల 28.08 సగటుతో అశ్విన్ మిగతా స్విన్నర్ల కంటే ఉత్తమ గణాంకాలతో టాప్ లో ఉన్నాడు.
అశ్విన్ గత నెలలో ఓవల్లోనే సోమర్సెట్తో జరిగిన కౌంటీ మ్యాచ్లో సర్రే జట్టు తరఫున ఆడి 27 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అశ్విన్ జట్టుకు దూరంగా ఉంచడం ఆశ్చర్యపరిచే విషయమే.
ఈ మైదానంలో స్పిన్నర్ల గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇంతకు ముందు స్పిన్ బౌలర్లు ఈ మైదానంలో అద్భుతంగా రాణించారు. 1998లో శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 65 పరుగులు ఇచ్చి తొమ్మిది వికెట్లు తీశాడు.
1997లో స్పిన్ బౌలర్ ఫిల్ తుఫ్నెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో, ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆలౌట్ చేసి ఇంగ్లండ్ విజయం సాధించింది.
స్పిన్ బౌలర్లు ఇప్పటికీ ఈ పిచ్లో అద్భుతంగా రాణిస్తున్నారని ఇటీవలి తాజా గణాంకాలను బట్టి కూడా తెలుస్తోంది.
''2015 నుంచి ఓవల్లో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్లలో ఫాస్ట్ బౌలర్లు 31.07 సగటుతో 123 వికెట్లు తీశారు. వారి స్ట్రైక్ రేట్ 60 బంతులకు ఒక వికెట్. ఇక్కడ స్పిన్నర్లు 29.01 సగటుతో 50 వికెట్లు తీశారు. వీరి స్ట్రైక్ రేట్ 51'' అని టీఎమ్ఎస్ డేటా స్పెషలిస్ట్ ఆండీ జల్జ్మాన్ అన్నారు.
అంటే మరేదైనా కారణం ఉందా?
''ఐదు-మ్యాచ్ల సిరీస్లో నాలుగు మ్యాచ్లలో అనుభవం, తెలివితేటలు ఉన్న బౌలర్ ను తుది జట్టులో ఆడించలేదు అంటే, ఏదైనా సఖ్యత సమస్య ఉండొచ్చని మీరు ఊహించవచ్చు'' అని మైఖేల్ వాన్ తెలిపారు.
ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ, అశ్విన్ కు మధ్య ఉన్న పొరపచ్చాలు కారణం కావచ్చు. మిగిలినవి కేవలం సాకులు మాత్రమే అయ్యి ఉంటాయి.
టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఇంగ్లండ్ జట్టులో నలుగురు ఎడమ చేతి బ్యాట్స్మన్లు ఉండటం మా ఎడమ చేతి స్పిన్నర్ రవీంద్ర జడేజాకు కలిసి వచ్చే అంశం అని చెప్పాడు.
''నలుగురు ఫాస్ట్ బౌలర్లతో లార్డ్స్లో భారత్ గెలిచింది. వారు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నారు. వారికి నలుగురు మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు'' అని మార్క్ రాంప్రకాష్ అన్నారు.
అంటే దీని అర్థం ఐదవ బౌలర్ జడేజానా లేక అశ్విన్ అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు, జడేజా బ్యాటింగ్ అంశాన్ని కలుపుకుని ఐదవ బౌలర్ స్థానానికి ఎంపిక చేసి ఉండొచ్చు. విరాట్ కోహ్లీ ఎవరి బ్యాటింగ్ని ఎక్కువగా ఇష్టపడతాడో ఈ నిర్ణయాన్ని బట్టి తెలుస్తోంది.
''భారతదేశంలో గత సిరీస్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టడంతో, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లపై అశ్విన్ కు స్పష్టమైన అంచనాలు ఉన్నాయి'' అని రాంప్రకాష్ తెలిపారు.
https://www.instagram.com/p/CJ5fE03HYN2/
జూన్ నుంచి భారత జట్టు ఇంగ్లండ్లో ఉంది. ఒకవేళ అశ్విన్ ఇంగ్లండ్తో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోతే, జో రూట్, ఇతర ఇంగ్లండ్ ఆటగాళ్లుసంతోషంగా ఉంటారని మీరు ఊహించవచ్చు.
దీనికి సంబంధించి, టామ్ మూడీ ఓ ట్వీట్ చేశారు. ''అశ్విన్ భారత తుది జట్టులోని 11మందిలో లేనందుకు ఆశ్చర్యపోయాను. జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఆడటానికి తగినంత స్కోప్ ఉందని నేను నమ్ముతున్నాను'' అని పేర్కొన్నారు.
అశ్విన్ కు చోటు దక్కకపోవడంపై ఇంగ్లండ్ మద్దతుదారులుకూడా ట్విటర్లో చాలా మంది #bbccricket హ్యాష్ ట్యాగ్ జత చేసి తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
''పోర్చుగల్ క్రిస్టియానో రొనాల్డోను ఎప్పుడైనా తొలగించిందా? అలాంటప్పుడు అశ్విన్ను భారతదేశం ఎందుకు ఆడించడం లేదు?'' అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
''అశ్విన్కు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. ఆయన ఈ సీజన్లో సర్రే జట్టుకు ఆడడాన్ని భారత సెలెక్టర్లు చూడలేదా? ఆయన అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ ఇంగ్లండ్ మద్దతుదారుడిగా, ఆయన ఆడకుండా ఖాళీగా కూర్చున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను'' అని కీర్ అనే నెటిజన్ పోస్ట్ చేశారు.
అశ్విన్ను తమకు అప్పుగా ఇవ్వమని భారత జట్టును ఇయాన్ అనే నెటిజన్ డిమాండ్ చేశాడు. ''యాషెస్ సిరీస్ కోసం ఇండియా మాకు అశ్విన్ను అప్పుగా ఇవ్వగలదా? ఆయన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు'' అని ఇయాన్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్షీర్లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. 'వందల్లో మృతులు’
- 'కశ్మీర్కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఏపీలోని ప్రైవేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించినంత ఫీజులే తీసుకుంటున్నారా? క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
- 2,700 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉత్తర భారతంలో తిరిగిన యువకుడు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు బయలుదేరారు
- డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)