ట్రంప్ కరుణిస్తారా ? షాకిస్తారా ? జూలై 9 డెడ్ లైన్ తో భారత్ ఆఖరి ప్రయత్నాలు..!
అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తమ ఆర్దిక వ్యవస్థను చక్కదిద్దుకునే క్రమంలో తమతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్.. ముప్పేట విమర్శలు, కోర్టు అక్షింతలతో దాన్ని 90 రోజుల పాటు వాయిదా వేశారు. ఆ గడువు జూలై 9తో ముగియనుంది. దీంతో జూలై 10 నుంచి భారత్ తో పాటు పలు దేశాలపై భారీ ఎత్తున సుంకాల మోత మోగబోతోంది. అదే జరిగితే ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో భారత బృందం అమెరికాలో చివరి ప్రయత్నాలు చేస్తోంది.
విదేశాలపై కనీసం 10 శాతం సుంకాల్ని పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా ఆపేందుకు ఇచ్చిన గడువు జూలై9తో ముగుస్తున్న నేపథ్యంలో దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ పొడిగించేది లేదని ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చేసారు. అంటే జూలై 9 తర్వాత సుంకాల మోత తప్పదన్న మాట. అయితే తమపై సుంకాల విషయంలో చూసీ చూడనట్లుగా ఉండే దేశాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చేందుకు ట్రంప్ సిద్దంగానే ఉన్నారు. కానీ భారత్ విషయంలో మాత్రం వదిలేసే పరిస్ధితి లేదు.

దీంతో జూలై 9 లోపు అమెరికాతో ఎలాగైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని సుంకాల మోత నుంచి తప్పించుకునేందుకు కేంద్రం ఓ ప్రత్యేక చర్చల బృందాన్ని గతంలోనే అమెరికాకు పంపింది. ఈ బృందం ఇప్పటికే అమెరికా అధికారులకు పలు ఆఫర్లు ఇస్తున్నారు. తద్వారా భారత్ పై ప్రతిపాదిస్తున్న 26 శాతం సుంకాల పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నారు. వీలైతే పూర్తిగా సుంకాల పెంపు లేకుండా చూడాలని కోరుతున్నారు. దీనిపై అమెరికా ఇప్పటివరకూ ఎటూ తేల్చలేదు. మరోవైపు జూలై 9తో ముగిసే గడువు పొడిగించబోమంటూ ట్రంప్ చెప్పేయడంతో భారత్ పరిస్ధితి ఇబ్బందికరంగా మారుతోంది.
గతంలో చెప్పిన మేరకు విదేశాలపై 10 శాతం, 25 శాతం, 35 శాతం, 50 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్న ట్రంప్.. ఇందులో భాగంగా ఆయా దేశాలకు లేఖలు రాసేందుకు సిద్ధమయ్యారు. 200 దేశాలతో తాను మాట్లాడలేనని, తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు మాత్రం మినహాయింపు ఇస్తానని చెప్తున్నారు. తద్వారా తాను పెట్టిన 90 రోజుల గడువులో 90 ఒప్పందాలు కుదుర్చుకోవడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పేస్తున్నారు. అంటే అమెరికాతో ఒప్పందం చేసుకుంటే సరే సరి... లేకపోతే భారీగా సుంకాల మోత తప్పదనేది ట్రంప్ ఇస్తున్న క్లారిటీ.












Click it and Unblock the Notifications