దారుణం: మహిళా టీవీ జర్నలిస్టును ఆమె ఇంట్లోనే హత్య చేశారు
ఢాకా: బంగ్లాదేశ్లో సుబర్ణ నోది(32) అనే మహిళా జర్నలిస్టును కొందరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. పాబ్నా నగరంలో తన ఇంట్లోకి వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె గొంతుకోసి చంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో బైక్లపై వచ్చిన 10-12మంది సాయుధులైన దుండగులు.. సుబర్ణ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ మోగించారు. ఆమె తలుపు తీయగానే ముందస్తు పథకం ప్రకారం తెచ్చుకున్న ఆయుధంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వెంటనే అక్కడ్నుంచి పరారయ్యారు.
తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న సుబర్ణను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. ఈ జర్నలిస్టు హత్యపై పాత్రికేయులు, సంఘాలు తీవ్ర ఆగ్రహంతో భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి.
హంతకులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాగా, సుబర్ణ నోది.. ఆనంద టీవీ ఛానల్లో న్యూస్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నారు. డైలా జాగృతో బంగ్లా పత్రికకు జర్నలిస్టుగా కూడా సేవలందించారు. భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సుబర్ణ తన కూతురుతో కలిసి జీవిస్తోంది. సుబర్ణ మరణంపై కేసు నమోదు చేసుకున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు.