భారత పర్యటనకు బాబర్ సేన రాకపై తేల్చేసిన పాకిస్తాన్..: అనుమానాలకు తెర
ఇస్లామాబాద్: ఐసీసీ వరల్డ్ కప్.. ఇంకో మూడు నెలల్లో ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాబోతోంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్తో తీరిక లేని షెడ్యూల్స్ను ఎదుర్కొంటోన్నాయి. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్గా నిలిచింది.
ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్లో అంటే.. తన మూడో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్కు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక అయింది.

ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన జరగాల్సి ఉంది. ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 15వ తేదీన జరిగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రీపోన్ అయింది. 15వ తేదీకి బదులుగా 14వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. ఈ రెండు దేశాల మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరుగుతుంది.
ఈ మార్పును పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అంగీకరించింది. అదే సమయంలో- భారత్తో మ్యాచ్కు ముందు తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిన ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ కొన్ని సూచనలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు పంపించింది. శ్రీలంకతో అక్టోబర్ 12వ తేదీన జరగాల్సిన మ్యాచ్ను ముందుకు జరపాలని విజ్ఞప్తి చేసింది. అంటే అక్టోబర్ 12వ తేదీకి బదులుగా 10వ తేదీ నాడే షెడ్యూల్ చేయాలని కోరింది.
భారత పర్యటనకు పాకిస్తాన్కు వస్తుందా? రాదా? అనే విషయంపై మొన్నటివరకు సందేహాలు వ్యక్తం అయ్యేవి. పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. భారత్కు వెళ్లేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది గానీ.. ఆ దేశ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లభించలేదు. దీనితో పాకిస్తాన్ రాకపై అనుమానాలు నెలకొన్నాయి.
తాజాగా- పాకిస్తాన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తమ దేశ జాతీయ జట్టును భారత్కు పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. క్రీడలతో రాజకీయాలను ముడిపెట్టి చూడట్లేదని వివరించింది. అందుకే భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న వరల్డ్ కప్ 2023లో తమ దేశం పాల్గొంటుందని స్పష్టం చేసింది.
భారత్- పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ.. క్రీడా సంబంధిత అంశాలకు అవి అడ్డు రాకూడదని భావిస్తోన్నామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రీడల విషయంలో నిర్మాణాత్మక, బాధ్యతాయుతంగా వ్యవహరించాలనేదే తమ అభిమతమని, తమ దేశ క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రతను భారత ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది.












Click it and Unblock the Notifications