తేడా వస్తే యుద్ధమే! ట్రంప్కు డ్రాగన్ స్ట్రాంగ్ వార్నింగ్..
ప్రపంచ రాజకీయాల్లో మరోసారి హైటెన్షన్ నెలకొంది. డ్రాగన్ కంట్రీ చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ముఖాముఖిగానే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తైవాన్ అంశంపై జోక్యం పెరిగితే అది కేవలం దౌత్యపరమైన వైఫల్యానికే పరిమితం కాదని, ఏకంగా ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందని జిన్పింగ్ కుండబద్దలు కొట్టారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం చైనా చేరుకున్న ట్రంప్తో, బీజింగ్లోని 'గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్'లో జిన్పింగ్ సుదీర్ఘంగా రెండు గంటల పాటు భేటీ అయ్యారు. దశాబ్దం తర్వాత వచ్చిన అమెరికా అధ్యక్షుడికి డ్రాగన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. తైవాన్ విషయంలో 'రెడ్ లైన్' దాటొద్దని అగ్రరాజ్యానికి తేల్చి చెప్పేసింది.
చైనా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత సున్నితమైనదని, ఇది ప్రాథమిక ప్రయోజనాలకు సంబంధించిన విషయమని జిన్పింగ్ స్పష్టం చేశారు. "తైవాన్ విషయంలో అమెరికా జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ పొరపాట్లు జరిగితే అది రెండు అగ్రరాజ్యాల మధ్య పెను సంక్షోభానికి దారి తీస్తుంది" అని ఆయన హెచ్చరించారు. తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని, దాన్ని విడదీయాలని చూస్తే ఉపేక్షించేది లేదని చైనా మరోసారి తన పాత పల్లవినే వినిపించింది. అయితే, చైనా హెచ్చరికలపై తైవాన్ దీటుగా స్పందించింది. ప్రాంతీయ శాంతికి, స్థిరత్వానికి అసలైన ముప్పు చైనాయేనని ఎద్దేవా చేసింది.

ఇరాన్ అణ్వాయుధాలపై ఉమ్మడి పోరు
తైవాన్ విషయంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఇరాన్ అణ్వస్త్రాల విషయంలో ఇద్దరు నేతలూ ఒకే మాటపై నిలబడటం గమనార్హం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ట్రంప్, జిన్పింగ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. అలాగే, ఇరాన్కు చైనా ఎటువంటి సైనిక సామగ్రిని సరఫరా చేయబోదని జిన్పింగ్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన భద్రత దృష్ట్యా 'హర్మూజ్ జలసంధి'ని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని, అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగాలని ఇరువురు నేతలు తీర్మానించుకున్నారు.
ఆర్థిక బంధం.. చమురు వ్యాపారం
భవిష్యత్తులో ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా, అమెరికా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు చైనా ఆసక్తి చూపింది. చైనా మార్కెట్లలో అమెరికా కంపెనీలకు ప్రవేశం కల్పించడం, అమెరికాలో చైనా పెట్టుబడులను ప్రోత్సహించడంపై శ్వేతసౌధం సానుకూల ప్రకటన చేసింది. వాషింగ్టన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని అమెరికా కంపెనీల ప్రతినిధులు ఈ భేటీలో కోరగా, జిన్పింగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
చారిత్రాత్మక ఏడాదిగా 2026!
ఈ భేటీని చరిత్రలోనే 'అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం'గా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. జిన్పింగ్ను ఒక గొప్ప నాయకుడిగా, మంచి స్నేహితుడిగా ఆయన పేర్కొన్నారు. "మా మధ్య ఉన్న సమస్యలను చాలా త్వరగా పరిష్కరించుకున్నాం. అమెరికా, చైనాలకు అద్భుతమైన ఉమ్మడి భవిష్యత్తు ఉంటుంది" అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. 2026 సంవత్సరం ఇరు దేశాల సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని జిన్పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సెప్టెంబరు 24న వైట్ హౌస్కు రావాలని జిన్పింగ్ దంపతులను ట్రంప్ ఆహ్వానించారు.
విధానం మారదు: మార్కో రూబియో
అగ్రనేతలు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం గట్టి సంకేతాలే పంపారు. తైవాన్ విషయంలో అమెరికా తన పంథాను మార్చుకోదని ఆయన స్పష్టం చేశారు. తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చైనా చూస్తే అది ఆ దేశం చేసే "భయంకరమైన తప్పిదం" అవుతుందని రూబియో హెచ్చరించారు. దీంతో అగ్రరాజ్యాల మధ్య స్నేహం నడుస్తూనే, మరోవైపు యుద్ధ మేఘాలు పొంచి ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.














Click it and Unblock the Notifications