Telangana SIR: తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ.. కోటికి పైగా ఓట్లు ఔట్..?
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటైజేషన్ దశ ఆగస్టు 10 తో పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 78.26 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ ప్రక్రియలో కోటికి పైగా ఓటర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 73.52 లక్షల ఓటర్లు అంటే 21.5 శాతానికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరగకపోవడంతో ఈ ఓట్లన్నీ పూర్తిగా తొలగిపోనున్నట్లు సమాచారం.
అలాగే ఓట్లలో తేడాలున్న అనామలీస్ జాబితాలో మరో 61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక వీటిలో కూడా ఎక్కువ శాతం ఓట్లు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. వీటితోపాటు 2002 కు సంబంధించిన అన్ మ్యాపింగ్ ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓటర్లకు ఆగస్టు 17 తర్వాత నోటీసులు అందిస్తారు. ఇలా చూసుకుంటే మొత్తంగా కోటికిపైగా ఓట్లను తొలగించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
ఇక రాష్ట్రంలో తొలగిపోనున్న ఓట్లలో ఎక్కువ భాగం గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే నమోదయ్యాయి. ఇక్కడే దాదాపు 43 లక్షల ఓట్లు ఔట్ అయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే అందులో 71.05 లక్షల మంది మాత్రమే బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిగతా 43.09 లక్షల మంది ఓట్లు తొలిగిపోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సోమవారం సాయంత్రానికి 2.64 కోట్ల మంది అంటే 78.26 శాతం ఓటర్ల పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మిగిలిన 74 లక్షల మంది ఓటర్లు తమ నింపిన పత్రాలను బీఎల్ ఓలకు సమర్పించలేదు. ఈ 74 లక్షల ఓట్లలో దాదాపు 73. 40 లక్షలు అంటే 21.70 శాతం ఓట్లను అన్ కలెక్టబుల్ జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో ఈ ఓటర్లు స్థానిక చిరునామాలో లేకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, మృతి చెందడం అలాగే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం.. తదితర కారణాల వల్ల వీటిని తొలగిస్తున్నారు.

ఇక సర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 94.31 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరిగింది. ఈ జాబితాలో చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో కేవలం 58.89 శాతం పత్రాలను మాత్రమే డిజిటలైజేషన్ చేశారు. ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 17 న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ ల స్వీకరణ ఉంటుంది. ఇక ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15 వరకు నోటీసులు జారీ, అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది. ఆ తర్వాత అక్టోబరు 19న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు.




Click it and Unblock the Notifications