Year Ender 2020 : చంద్రుడిపై భారీగా నీటి ఆనవాళ్లు... నాసా పరిశోధనల్లో వెల్లడి...
ఖగోళ రహస్యాలు ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటాయి. ఆదీ అంతం చిక్కని విశ్వంతరాళంలో శాస్త్రవేత్తల పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో నేషనల్ ఏరోనాటిక్స్&స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) చంద్రుడికి సంబంధించి పలు కొత్త విషయాలను ఆవిష్కరించింది. చంద్రుడి దక్షిణార్ధ గోళంలో క్లావియస్ అనే ఓ భారీ బిలంపై నీటి జాడను నాసా గుర్తించింది.భూమిపై నుంచి చూస్తే చంద్రుడిపై కనిపించే పెద్ద శిలల ఆనవాళ్లు క్లావియస్ బిలానికి చెందినవేనని నాసా వెల్లడించింది.
చంద్రుడిపై నీడ కమ్ముకుపోయిన ప్రాంతాల్లోనే గాకుండా వెలుతురు ప్రసరించే ప్రాంతాల్లో కూడా నీటి జాడలు కనిపించినట్టు నాసా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. తద్వారా గతంలో అంచనా వేసిన దాని కంటే చందమామ మీద భారీ స్థాయిలోనే నీటి ఆనవాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి ఉపరితలంపై ఒక క్యూబిక్ మీటర్ మట్టిలో 12 ఔన్సుల నీరు (354 మి.లీ) చొప్పున భారీ ఎత్తున నీళ్లు ఉండవచ్చునని అంచనా వేశారు. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు ఈ ఆవిష్కరణలు ఉపయోపగపడుతాయని తెలిపారు.
Year Ender 2020 : అంగారకుడిపై మూడు నీటి సరస్సులు.. ఈ ఏడాది పరిశోధనల్లో వెలుగులోకి...
అంగారక గ్రహంపై కూడా కొత్తగా మూడు ఉప్పు నీటి సరస్సులను గుర్తించినట్లు ఈ ఏడాది శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మూడు సరస్సులు అంగారక ఉపరితలం కింద కప్పిపెట్టబడి ఉన్నాయని... వీటి విస్తీర్ణం దాదాపు 75వేల చదరపు కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. ఇదే ఏడాది జపాన్లోని టోక్యో విశ్వ విద్యాలయ పరిశోధకుల బృందం జరిపిన పరిశోధనలో అంగారక గ్రహంపై 4.4బిలియన్ల సంవత్సరాల క్రితం నుంచే నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనుగొన్నారు.
ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో ఈ ఏడాది మరో అద్భుతం కూడా ఆవిష్కృతమైంది. జపాన్ అంతరిక్ష సంస్థ (జాక్సా) అంతరిక్షంలోకి పంపించిన హయబుసా వ్యోమోనౌక క్యాప్సూల్ భూమికి 30 కోట్ల కి.మీల దూరంలో ఉన్న ర్యుగు గ్రహశకలానికి చెందిన నమూనాలను తీసుకొచ్చింది.గతేడాది భూమి వైపు తిరుగు ప్రయాణం మొదలు పెట్టిన హయబుసా 2 ఇటీవలే విజయవంతంగా భూమిని చేరింది. హయబుసా క్యాప్సూల్ సేకరించిన గ్రహ శకల నమూనాలను పరిశీలించగా... అందులో ఇసుక,మట్టి,గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు.