‘మీరు లేని ఉదయాన్ని ఎలా చూడాలి’: థాయ్ డైవర్ సమన్ భార్య అంతులేని వేదన
బ్యాంకాక్: 12మంది బాలురు, వారితోపాటు వెళ్లిన ఫుట్బాల్ కోచ్లను కాపాడే క్రమంలో సమన్ కునన్(38)అనే డైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ డైవర్ చేసిన సాయంతోనే వారంతా క్షేమంగా బయటపడటం గమనార్హం.
Recommended Video
థాయ్లాండ్లోని థామ్ లుయాంగ్ గుహలో చిక్కుకున్న 12మంది బాలురు, వారి కోచ్లను బుధవారం థాయ్ డైవర్లు, రెస్క్యూ టీం క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. అంతా బాగానే, ఉన్నా.. డైవర్ కునన్ మరణం మాత్రం ఆయన కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
ఉదయాన్నే లేచి ఎవర్ని చూడాలి..
‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే నా ప్రాణం. నా సర్వస్వం. ఇక నేను ఉదయాన్నే లేచి ఎవర్ని చూడాలి?' అంటూ కునన్ భార్య వలీపోన్ కునన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమన్తో కలిసి దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది.
ఆయన లేరన్న నిజాన్ని..
తన భర్త లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని కన్నీటిపర్యాంతమైంది. అయితే, తన భర్త చనిపోవడానికి కారణం గుహలో చిక్కుకున్న చిన్నారులు కాదని, వారిని ఎవరూ నిందించొద్దని వలీపోన్ అన్నారు. కాగా, ఆమె పోస్టు చేసిన ఫొటోలకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఆమె భర్త సహసాన్ని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్పారు.
హీరో అంటూ ధైర్యం చెబుతున్న నెటిజన్లు
‘మీ భర్త చాలా ధైర్యవంతుడు. ఆయన సాయాన్ని ప్రపంచం మర్చిపోదు. ధైర్యంగా ఉండండి' అని నెటిజన్లు వలీపోన్కి మద్దతుగా వ్యాఖ్యానిస్తున్నారు. సమన్ 13మంది ప్రాణాలు కాపాడే క్రమంలో తన ప్రాణం త్యాగం చేశారని, ఆయన అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ హీరోగా నిలిచి ఉంటారని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.
గుహ వద్ద సమన్ విగ్రహం
కాగా, చిన్నారులను కాపాడేందుకు సమన్ చేసిన సాయాన్ని ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆయన స్నేహితులు తెలిపారు. సమన్ చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డామని, కానీ, ఆయన చిన్నారుల కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టినందుకు గర్వపడుతున్నామని చెప్పారు. కాగా, సమన్ మృతికి సంతాపంగా లుయాంగ్ గుహకు సమీపంలోనే ఆయన విగ్రహాన్ని నెలకొల్పుతామని థాయ్లాండ్కు చెందిన సంస్థ ఒకటి వెల్లడించింది.