IPL 2020: క్షమించండి..మీ ఆశలను వమ్ము చేశాం: ఏబీ డివిలియర్స్
అబుదాబి: అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అనూహ్యంగా ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగింది. సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ ప్రారంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ముంగిట వరుస పరాజయాలు చవిచూసింది. చివరికి అతి కష్టంపై ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. అయితే గతరాత్రి జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడింది. దీంతో ఈసారైనా ట్రోఫీ అందుకోవాలన్న ఆ జట్టు కల కలగానే మిగిలిపోయింది.
ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ కలగానే మిగిలిపోవడం పట్ల భారమైన హృదయంతో బెంగళూరు ఆటగాళ్లు టోర్నీకి గుడ్బై చెప్పారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల మధ్య జరిగిన చివరి సంభాషణ వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తదితరులు.. అభిమానులను, వీక్షకులను నిరాశపరచడంపై ఉద్వేగంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్ అభిమానుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో బాగా ఆడి అభిమానులను అలరించినప్పటికీ.. అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణలు కూడా కోరాడు. వచ్చే సీజన్లో మరింత బలంగా వస్తామని హామీ ఇచ్చాడు. చిరస్మరణీయ పోటీ నుంచి నిరాశగా తప్పుకుంటున్నామని ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్ చేసింది. తాజా సీజన్లో 454 పరుగులు చేసి డివిలియర్స్ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. 15 మ్యాచ్లో మూడు అర్ధ సెంచరీలు చేసిన ఏబీ 158.7 స్ట్రయిక్రేట్తో ఈ ఘనత సాధించాడు. అలాగే ఓపెనర్లు ఆరోన్ ఫించ్, దేవ్దత్ పడిక్కల్ కూడా బెంగళూరు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సామాజిక మాధ్యమాల్లో కూడా స్పందించాడు. జట్టు బృందంతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు. 'ఒడుదొడుకుల సమయాల్లో జట్టు సమష్టిగా ఉంది. ఒక బృందంగా ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉంది. ఇక పరిస్థితులు మాకు అనుకూలంగా మారలేదనేది నిజమే అయినా మా ఆటగాళ్ల పట్ల గర్వంగా ఉంది. ఎప్పటిలాగే మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.