ధోనీ కేప్టెన్సీపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఏం చెబుతోంది?: ఆ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టే
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పీడకలను మిగిల్చిన ఐపీఎల్-2020 సీజన్ ఇది. ఐపీఎల్ హిస్టరీలో ఎప్పుడూ లేనివిధంగా అత్యంత అవమానకరంగా ధోనీసేన ఈ మెగా టోర్నమెంట్ను తప్పుకోవాల్సి వచ్చింది. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందు టైటిల్ హాట్ ఫేవరెట్గా కనిపించిన ధోనీ సారథ్యంలోని ఎల్లో ఆర్మీ.. మ్యాచ్లు సాగుతున్న కొద్దీ నిస్సారంగా తయారయ్యారు. గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఓటమిని కొని తెచ్చుకున్నారు. గట్టి పోటీ కాదు కదా..కనీసం ప్లేఆఫ్కు కూడా చేరలేకపోయారు. ఈ సీజన్లో ఇంటిదారి పట్టిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది.

వేటు తప్పదనుకున్నప్పటికీ..
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనపై టీమ్ మేనేజ్మెంట్ ఏ మాత్రం సంతృప్తికరంగా ఉండట్లేదనేది బహిరంగ రహస్యం. జట్టు ప్రదర్శన అత్యంత నాసిరకంగా ఉండటం పట్ల ఆగ్రహాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఐపీఎల్-2021 నాటికి జట్టులో భారీగా ప్రక్షాళన చేయొచ్చనే గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ముదురు ఆటగాళ్లను తొలగించి.. యువరక్తాన్ని నింపుతారని, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపైనా వేటు పడొచ్చని అంతా భావించారు. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్లను వదులుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ల కాంట్రాక్ట్ను రెన్యూవల్ చేసుకోదలచుకోలేకపోవచ్చని అనుమానించారు.

తెరదించిన టీమ్ మేనేజ్మెంట్..
ఈ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్కు కూడా తమ ఫ్రాంఛైజీకి ధోనీ కేప్టెన్గా వ్యవహరిస్తాడని స్పష్టం చేసింది. ధోనీ సారథ్యాన్ని మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది. ఐపీఎల్-2021 సీజన్లో తమ జట్టుకు ధోనీ కేప్టెన్సీ ఉంటాడని పేర్కొంది. అతని నేతృత్వంలో వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నమెంట్కు వెళ్తామనీ తేల్చేసింది. మిగిలిన ఆటగాళ్లను కొనసాగిస్తారా? లేదా? అనే అంశంపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేమని చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ తెలిపారు.

ఒక్క సీజన్తో తక్కువగా అంచనా వేయలేం..
తమ జట్టు ఇదివరకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా ఆవిర్భవించిందని, అయిదుసార్లు రన్నరప్గా నిలిచిందని కాశీ విశ్వనాథన్ చెప్పారు. ఏ ఇతర జట్టుుకు కూడా ఇంత చక్కటి ట్రాక్ రికార్డు లేదని అన్నారు. ఓ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్ష్న మాట్లాడారు. ఈ సారి తమకు అదృష్టం కలిసిరాలేదని, ఈ ఒక్క ఏడాది మాత్రమే తాము ప్లేఆఫ్కు చేరలేకపోయామని వ్యాఖ్యానించారు. దీన్ని ఆధారంగా చేసుకుని జట్టు ఆటగాళ్ల ప్రతిభను తక్కువగా అంచనా వేయలేమనే నిర్ణయానికి వచ్చినట్లు కాశీ విశ్వనాథన్ చెప్పారు. ఒక్క సీజన్లో సరిగ్గా ఆడలేదంటే.. జట్టు మొత్తాన్నీ మార్చేయాలనేది దాని అర్థం కాదని చెప్పారు.

గెలవాల్సిన మ్యాచుల్లో ఓడాం:
గెలిచి తీరాల్సిన, గెలవదగ్గ మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిందని, దాని ఫలితంగా తాము ప్లేఆఫ్కు చేరలేకపోయామని అన్నారు. ఓటమి ప్రభావం జట్టుపై ఎంతో కొంత ఉంటుందని, అలాగనీ ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కఠిన నిర్ణయాలను తీసుకోవాలనుకోవడం సరికాదని తాను అభిప్రాయపడుతున్నట్లు కాశీ విశ్వనాథన్ చెప్పారు. ఆల్రౌండర్ సురేష్ రైనా, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టుకు దూరం కావడం వల్ల సమతుల్యం దెబ్బతిన్నదని అంచనా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా వాతావరణం కూడా జట్టు ఓటమికి ఓ కారణమై ఉండొచ్చని చెప్పారు.

అద్భుత ట్రాక్ రికార్డ్ ఉన్నా..
నిజానికి- చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న తరువాత కూడా ఈ స్థాయిలో పరాభవాన్ని చవి చూడలేదా జట్టు. ఫిక్సింగ్ ఆరోపణల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్లో నిషేధానికి గురైన ఆ రెండేళ్ల సీజన్ను పక్కన పెడితే.. ప్రతీసారీ తనదైన ముద్రను వేస్తూ వచ్చింది. టోర్నమెంట్పై ఆధిపత్యాన్ని చలాయించింది. ప్రతీసారీ ప్లేఆఫ్లో అడుగు పెట్టింది. 2010, 2011, 2018ల్లో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. 2008, 2012, 2013, 2015, 2019ల్లో రన్నరప్గా నిలిచింది. అందుకే- టీమ్ మేనేజ్మెంట్.. ధోనీ కేప్టెన్సీపై నమ్మకాన్ని సడలించుకోవట్లేదనేది తేలిపోయింది.












Click it and Unblock the Notifications