IPL 2020: ముగిసిన సన్రైజర్స్ జర్నీ...ఢిల్లీపై పోరాడి ఓడిన ఆరెంజ్ ఆర్మీ
అబుదాబి: ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ పోరాటం ముగిసింది. ఫైనల్కు చేరాల్సి ఉన్న మ్యాచ్లో వార్నర్ సేన ఢిల్లీ క్యాపిటల్స్ పై పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శిఖర్ ధవన్ రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. 190 పరుగులతో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టు ఆదిలోనే వార్నర్ను రబడా ఔట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. అయినప్పటికీ సన్రైజర్స్ జట్టు స్కోరు పవర్ ప్లేలో బాగానే చేసింది.
ఇక మనీష్ పాండే (21 పరుగులు) ప్రియం గార్గ్లు మంచి భాగస్వామ్యం నిర్మిస్తున్న క్రమంలో స్టాయినిస్ గార్గ్ను బోల్తా కొట్టించాడు. చక్కటి బౌలింగ్తో బౌల్డ్ చేశాడు. ఇక నాల్గవ స్థానంలో వచ్చిన కేన్ విలయమ్స్ తొలి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడాడు. పాండేతో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ సెట్ అయినట్లు కనిపించిన తరుణంలో మరోసారి స్టాయినిస్ వేసిన బంతిని మనీష్ పాండే ఆడబోయి నార్టేకు చిక్కాడు. ఇక జేసన్ హోల్డర్ విలయమ్సన్ క్రీజ్లో ఉన్నంత సేపు చక్కటి షాట్లతో అలరించారు. ఒకానొక సమయంలో సన్రైజర్స్ గెలుపు ఖాయమనేలా వీరిద్దరూ ఆడారు. చక్కటి షాట్లతో స్కోరును పరుగులు పెట్టించారు. ఇక అక్సర్ పటేల్ వేసిన బంతిని భారీ షాట్గా మలచబోయి దూబేకు జేసన్ హోల్డర్ చిక్కాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కేన్ విలయమ్సన్ మాత్రం తన పోరాటాన్ని ఎక్కడా ఆపలేదు.
జేసన్ హోల్డర్ ఔట్ కావడంతో బరిలోకి దిగి హార్డ్ హిట్టర్ అబ్దుల్ సమాద్ చూడ చక్కని షాట్లతో విరుచుకుపడ్డాడు. విలయమ్సన్కు చక్కటి సపోర్ట్ను అందించాడు. వీరిద్దరూ కుదురుకున్నారనుకునే సమయంలో స్టాయినిస్ మరోసారి బంతితో అద్భుతం చేశాడు. 67 వ్యక్తిగత పరుగుల వద్ద విలయమ్సన్ను స్టాయినిస్ ఔట్ చేయడంతో సన్రైజర్స్ ఆశలు సన్నగిల్లాయి. ఇక చివర్లో రబడా వేసిన ఓవర్లో మూడు వికెట్లు పడిపోవడంతో సన్రైజర్స్ ఓటమి ఖాయమైంది. 33 వ్యక్తిగత పరుగుల వద్ద సమాద్ను రబడా ఔట్ చేయగా అదే ఓవర్లో రశీద్ ఖాన్, గోస్వామిలు ఔట్ అయ్యారు. దీంతో సన్ రైజర్స్ కథ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ జట్టు 8 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇటు బ్యాట్తోను అటు బాల్తోను అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేయర్ మార్కస్ స్టాయినిస్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 27 బంతుల్లో 38 పరుగులు చేసి... చక్కటి బౌలింగ్తో 3 కీలక వికెట్లను స్టాయినిస్ తీసుకున్నాడు. ఇక మంగళవారం అంటే నవంబర్ 10వ తేదీన ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్స్ జరుగుతుంది.