IPL 2020:టామ్ మూడీ బెస్ట్ ఎలెవెన్ జట్టు: కోహ్లీకి దక్కని చోటు
హైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైంది. ఈ నేపథ్యంలో టోర్నీలో నిలకడగా రాణించిన ఆటగాళ్లతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ.. తన ఐపీఎల్ 2020 బెస్ట్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు.
It's time to select your team of the tournament, here's mine! @IPL #IPL2020
— Tom Moody (@TomMoodyCricket) November 9, 2020
1. S Dhawan - DC
2. KL Rahul - KXIP
3. S Yadav - MI
4. ABD* - RCB
5. I Kishan - MI
6. R Tewatia - RR
7. R Khan* - SRH
8. J Archer* - RR
9. K Rabada* - DC
10. Y Chahal - RCB
11. J Bumrah - MI
ఐపీఎల్ 2020లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 11 మంది ఆటగాళ్లను ఎంచుకుని.. టామ్ మూడీ తన బెస్ట్ ఎలెవన్ జట్టును ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 'ఐపీఎల్ జట్టును ఎన్నుకునే సమయం వచ్చింది.. ఇది నా జట్టు' అని ట్వీట్ చేశాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు మూడీ చోటు కల్పించాడు. ముంబై ఇండియన్స్ నుంచి ముగ్గురు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ నుంచి ఇద్దరు.. సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల నుంచి ఒక్కొక్క ఆటగాడిని ఎంచుకున్నాడు.
ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్ ధావన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ కేఎల్ రాహుల్లను టామ్ మూడీ సెలెక్ట్ చేసుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ప్రస్తుతం రాహుల్ 670 పరుగులతో టాప్లో ఉండగా.. ధావన్ 603 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రాబోయే ఫైనల్లో రాహుల్ను అధిగమించే అవకాశం ధావన్కు ఉంది. మూడో స్థానం కోసం ఇప్పటివరకు 461 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశాడు.
మిడిల్ ఆర్డర్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్లను టామ్ మూడీ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2020ని డివిలియర్స్ 454 పరుగులతో పూర్తి చేయగా.. కిషన్ ఇప్పటివరకు 483 రన్స్ చేశాడు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఆల్రౌండర్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియాకు అవకాశం ఇచ్చాడు.
బౌలింగ్ విభాగంలో టామ్ మూడీ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నాడు. రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చహల్ స్పిన్నర్లు కాగా.. కాగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ పేసర్లు. ఈ టోర్నమెంట్లో చహల్ 21, రషీద్ 20 వికెట్లు పడగొట్టారు. రబాడ 29, బుమ్రా 27, ఆర్చర్ 20 వికెట్లు తీశారు. అయితే మూడీ తన జట్టుకు కెప్టెన్ ఎవరో మాత్రం ప్రకటించలేదు. ఫైనల్ మ్యాచ్ ఉన్నందున బుమ్రా వికెట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చహల్, కాగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్.