వైఎస్ వివేకా హత్య కేసులో మరొకరి అరెస్ట్..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే అపిస్తోంది. హత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి వ్యవసాయ పొలాలు చూసే పర్సనల్ అసిస్టంట్ జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమా శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఉమా శంకర్ అనుమానితుడిగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇతడిని పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు ఉమా శంకర్ రెడ్డిని తరలించనున్నారు. సిట్ బృందాన్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణకు సిట్ బృందంలోని సభ్యుడు ఎస్ఐ జీవన్ రెడ్డి హాజరయ్యారు.
2019 మార్చిలో నెలలో ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. కడప కేంద్రంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కీలక డాక్యుమెంట్లను సీబీఐ సీజ్ చేసినట్లు సమాచారం. తర్వాత వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారో చెబితే వారికి బహుమతి ఇస్తామని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీబీఐ వెల్లడించడం చర్చనీయాంశమైంది. కడప జిల్లా కారాగారం, పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి. కడపలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సుంకేసులకు చెందిన ఉమా శంకర్రెడ్డి, సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్లతోపాటు మరికొంతమందిని ప్రశ్నించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి విచారణ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో చూడాలి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని ప్రశ్నిస్తోంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు పులివెందుల సీఐగా పని చేసి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న శంకరయ్యను విచారణకు పిలిచారు. మరో విలేఖరిని కూడా విచారణకు పిలిచారు. వివేకా హత్య జరిగిన రోజు ముందుగా గుండెపోటుగా ప్రచారం చేసింది ఎవరనే దానిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డే వివేకా హత్య విషయాన్ని పులివెందుల సీఐకు ఫోన్ చేసి చెప్పినట్లు వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వీరందరినీ పిలిచినట్లు తెలుస్తోంది.