లోకసభ ఎన్నికలు 2019 : కడప నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
కడప జిల్లా... ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ఒక జిల్లా.ఒకప్పుడు ఫ్యాక్షనిజంకు పెట్టిన పేరు. కానీ మారుతున్న కాలంతో పాటు అక్కడి పరిస్థితులు, ప్రజలు కూడా మరుతూ వచ్చారు. ఎంతో మంది గొప్ప వారికి కడప జిల్లా ఊపిరిపోసింది. "విశ్వధాభిరామ వినురవేమ"అనే మాట తెలియని తెలుగువారుండరు. ఇది రాసిన వేమన కవి కడప జిల్లాలో పుట్టారు. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి తన చివరి రోజులు కడప జిల్లాలోనే గడిపారు.
స్వాతంత్ర సమరయోధులు కోటిరెడ్డి పేరు తెలియని వారుండరు.ఆయన ఇక్కడి వారే కావడం విశేషం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వై. వేణుగోపాల్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. కడప జిల్లాలో విద్యావంతులు కూడా చాలా ఎక్కువే. చాలామంది ఉన్నత చదువులు చదివి దేశ విదేశాల్లో సేవలందిస్తున్నారు. కడప గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇక రాజకీయంగా కడప జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కడప జిల్లాలో పార్టీల పరంగా పోటీ నెలకొంటుందని చెప్పడం కంటే కుటుంబపరంగా పోటీ ఉంటుందని చెబితే బాగుంటుంది. ఇక్కడి నుంచి ఎంతో మంది మహామహులు పార్లమెంటుకు పోటీ చేశారు. కడప లోక్సభ గురించి ఒక్కసారి పరిశీలిస్తే...
కడప లోక్ సభ...
రాయలసీమ అంటే రతనాల సీమగా పేరుగాంచింది. కానీ పాలకుల వల్లే రాయలసీమ కరువు ప్రాంతంగా మిగిలిపోయింది. ముఖ్యంగా కడప జిల్లాలో సహజ వనరులు ఉన్నప్పటికీ ఆ జిల్లాను మాత్రం కరువు పట్టి పీడిస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రులు అయినప్పటికీ కడపను కరువునుంచి పెద్దగా గట్టెక్కించలేకపోయారు. వైయస్ రాజశేఖర రెడ్డి తొలిసారిగా 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కడపలో అభివృద్ధి కనిపించింది. ఆనాడు కడప జిల్లాకు వైయస్ సీఎంలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. కానీ పుట్టిన గడ్డకోసం ఏదైనా చేయాలని భావించిన వైయస్... అక్కడికి ట్రిపుల్ ఐటీ, రిమ్స్ లాంటి సంస్థలను తీసుకొచ్చారు. ఇందుకోసమే వైయస్ కుటుంబానికి అక్కడి ప్రజలు ఇప్పటికీ పట్టం కడతారు. కడప అంటే రాజకీయంగా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగా మారిపోయింది.
ఇక కడప లోక్సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీలుగా వైసీపీ టీడీపీలే ఉంటాయి. ప్రస్తుతం వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ టీడీపీ ఎలాగైనా సరే అక్కడ జగన్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఎలాగైతే ఓటమిపాలయ్యేలా స్కెచ్ వేశారో... అంతకు మించి ప్రణాళికలు వేస్తున్నారు అక్కడి స్థానిక టీడీపీ నేతలు.
కడప పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 8 సాధారణ ఎన్నికలు ఒక ఉపఎన్నిక జరిగింది. 1952లో తొలిసారిగా జరిగిన కడప లోక్ సభ స్థానం నుంచి వై.ఈశ్వర్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఆయన కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన నాలుగు సార్లు సీపీఐ పార్టీ తరపున గెలిచారు. కాంగ్రెస్ తరపున రెండు సార్లు కందుల ఓబుల్ రెడ్డి ఎంపీగా గెలువగా ఒక్కసారి టీడీపీ నుంచి డీఎన్ రెడ్డి గెలిచారు. ఇక తొమ్మిదవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కడప పార్లమెంటు స్థానాన్ని వైయస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున వైయస్ అవినాష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది.
కడప పార్లమెంటు స్థానం వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వైయస్ వివేకానంద రెడ్డి ఎంపీగా బరిలోకి దిగుతారనే వార్తలొస్తున్నాయి. ఇక కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోటీ చేసినా అక్కడి స్థానిక సమస్యల కారణంగా క్యాడర్ ఒకరికొకరు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇది వైసీపీకి ప్లస్ పాయింట్ కానుంది. టీడీపీ నుంచి సీఎం రమేష్ లేదా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ తరపున బరిలో నిలిచే అవకాశం ఉంది. వైసీపీని ఎలాగైనా దెబ్బతీయాలని అక్కడ టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. 2011లో కడపకు జరిగిన ఉపఎన్నికలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 5 లక్షల పై చిలుకు రికార్డు మెజార్టీ సాధించారు. ఇక 2014లో అవినాష్ రెడ్డి తన సమీప టీడీపీ ప్రత్యర్థి రెడ్డపగారి శ్రీనివాస్ రెడ్డిపై 1,90,323 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఆయా సామాజిక వర్గాల వారీగా ఓట్లు..
ఇక కడప పార్లమెంట్ నియోజక వర్గంలో రెడ్డి సామాజిక వర్గమే అధికంగా ఉంది.అయితే ఇక్కడ అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం ముస్లిం సామాజిక వర్గంకు చెందిన ఓటర్లే. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటు శాతం 16శాతంగా ఉంది. వీరి ఓటే అభ్యర్థి విజయంలో కీలకంగా మారనుంది. కడప లోక్సభ స్థానంలో 13,29,729 ఓటర్లు ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 3.5 లక్షలు ఉన్నాయి. ఇక కమ్మ, బలిజ, బ్రాహ్మణులు, వైశ్యా సామాజిక వర్గాలకు మొత్తం కలిపి 5,06,219 ఓట్లు అంటే 38.2శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇక బీసీలు అంటే దాసరి, జంగమ, పద్మశాలి, గొల్ల, యాదవ, ఈడిగ, గౌడ, సాలె, బేస్త, చాకలి, ఆచారి, విశ్వబ్రాహ్మణ, తలారి, వడ్డెర, మంగలి, కుమ్మరి, ఉప్పర, కురువ, గాండ్ల, తొగట సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 3,10,068 ఉండగా ఓటు శాతం 23.4శాతంగా ఉంది.
మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో రెడ్డి సామాజిక వర్గానికంటే బీసీ సామాజిక వర్గాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ముస్లిం సామాజిక వర్గం ఓట్లు 1,80,394 ఉండగా బీసీ దూదేకుల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 30,319 ఉన్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలది కలిసి 15.9శాతంగా ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు 2,20,243 ఉండగా... అందులో మాల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు1,25,823 ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 94,421 ఉన్నాయి.ఇక ఎస్టీ ఓట్లు 34,561ఓట్లుండగా... ఎరుకల సామాజిక వర్గం ఓట్లు 14,467 సుగాలి ఓట్లు 6289 ఓట్లు, యానాదుల సామాజిక వర్గం ఓట్లు 4714 ఉన్నాయి. ఇక తక్కువ సంఖ్యలో క్రిస్టియన్ బీసీ ఓట్లు 22,456 ఉన్నాయి.
మొత్తానికి ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కావడంతో కడప లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ఆసక్తి కరంగా మారనున్నాయి. దేశంలోనే రికార్డు స్థాయిలో వైసీపీని గెలిపించిన ఓటర్లు ఈ సారి ఎవరిని ఎంత మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధమయ్యారో తెలియాలంటే ఈ ఏడాది ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే.