ఆ ప్రాచీన ఆలయానికి జగన్- భక్తులకు ముత్యంతో కూడిన తలంబ్రాల పంపిణీ
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. దీనికోసం జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. జగన్ రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోన్నారు. క్రిస్మస్ పండగ వేడుకల్లో పాల్గొన్న తరువాత మళ్లీ ఆయన తన సొంత జిల్లా పర్యటనకు రాబోతోండటం ఇదే తొలిసారి.
జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవస్థానాన్ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 5వ తేదీన జరుగనున్న సీతారాముల కల్యాణానికి హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు.

సీతారాముల కల్యాణం రోజున భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఇవ్వాళ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో కలిసి పరిశీలించారు. విభాగాల వారీగా జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. కల్యాణోత్సవం రోజున వైఎస్ జగన్- రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు.
కల్యాణ వేదిక వద్ద భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే ముందే ముత్యంతో కూడిన తలంబ్రాలు, పసుపు కుంకుమ, అన్నప్రసాదం ప్యాకెట్ అందిస్తామని ధర్మారెడ్డి చెప్పారు. సీతారాముల వారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారని అంచనా వేశామని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నామని వివరించారు. తొక్కిసలాట చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేలా ఈ ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు.

భక్తుల కోసం తగినన్ని మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఈఓ చెప్పారు. అంతకు ముందు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆలయ పరిపాలన భవనం వద్ద గల విశ్రాంతి గృహం, ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణ వేదిక వద్ద చేపట్టిన ఏర్పాట్లను ధర్మారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications