40 మంది కానిస్టేబుళ్లకు కరోనా, శిక్షణ కేంద్రంలో కలకలం, మొత్తం 850 మందికి ట్రైనింగ్..
ఎక్కడ, ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు గానీ.. ప్రతీ చోట వైరస్ బయటపడుతోంది. తాజాగా కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో కరోనా కేసులు బయటపడ్డాయి. అయితే ఒకటి, రెండు కేసులు కాకుండా.. పదుల సంఖ్యలో బయటపడటంతో ఆందోళన నెలకొంది. శిక్షణలో ఉన్న మిగతావారి పరిస్థితి ఏంటీ అనే ఆందోళన నెలకొంది. వారికి కూడా అధికారులు వైద్య పరీక్షలు చేస్తామని చెబుతున్నారు.
కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో 40 మంది శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసు అధికారులు షాక్ తిన్నారు. అక్కడ సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన 850 మంది కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారు. 40 మందికి పాజిటివ్ రావడంతో మిగతావారి పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న తలెత్తింది. అయితే అక్కడ శిక్షణలో ఉన్న అందరికీ పరీక్షలు చేస్తామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకితే తెలిసే అవకాశం ఉంది. లేదంటే వైరస్ మరింత ప్రబలే ఛాన్స్ ఉన్నాయి.
Recommended Video
సోమవారం కరీంనగర్లో 48 పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే వీరిలో 40 మంది ట్రైనింగ్ సెంటర్లో ఉన్న కానిస్టేబుళ్లు కావడం విశేషం. మిగతా 8 మంది జిల్లాల్లోని ఇతర ప్రాంతాలకు అని తెలుస్తోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 1610 మందికి కరోనా వైరస్ వచ్చింది. వీటితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,142కు చేరింది. వైరస్ సోకిన 9 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 480కి చేరుకుంది. కరోనా వైరస్ తగ్గడంతో 803 డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 42,909కి చేరింది. రాష్ట్రంలో 13,753 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.