బండి జాగరణ దీక్ష: రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు.. ఈ సారి ఇందుకే
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మరో దీక్ష చేపట్టనున్నారు. ఇటీవల నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ జాగరణ దీక్ష చేపడుతున్నారు. జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నారు. ఇవాళ రాత్రంతా ఆయన జాగరణ దీక్ష చేస్తారు. నిద్రపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేల్కొలపడానికే దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. కరీంనగర్లో గల తన కార్యాలయంలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు జాగరణ కార్యక్రమం కొనసాగనుంది.
వారి సేవలు..
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని బండి సంజయ్ అన్నారు. చారిత్రకమైన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. తాజాగా కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రీ అలాట్ మెంట్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు.
స్థానికేతరులు..
బదిలీల ప్రక్రియ పేరుతో ఈ జీవోను అమలు చేస్తే లక్షలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు చనిపోతున్నా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రావడం లేదని విమర్శించారు. వెంటనే 317జీవోను ఉపసంహరించుకోవాలని లేకపోతే..ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు
నిరుద్యోగ దీక్ష
ఇంతకుముందు ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ దీక్షను ముందుగా ఇందిరాపార్కులో చేపట్టాలని అనుకున్నా కరోనా నిబంధనల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. దీక్షను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ ప్రారంభించగా.. పదాధికారులు, విజయశాంతి, ఈటల రాజేందర్, స్వామిగౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ 2023లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఆ క్రమంలోనే బండి సంజయ్ ప్రజల్లోకి వెళుతున్నారు. నిన్న నిరుద్యోగ దీక్ష.. ఇవాళ జాగరణ దీక్ష చేపడుతున్నారు.