25 వేల ఓట్ల మెజార్టీ.. ఈటల విజయ ఢంకా ఖాయం: రఘునందన్ రావు
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మరో 11 రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్లో కొనసాగుతున్నారు. 5 వేల ఓట్లతో ముందు వరసలో ఉన్నారు. మిగతా రౌండ్లు కూడా ఇలానే కొనసాగితే ఈటల రాజేందర్ విజయం ఖాయమే.. టీఆర్ఎస్ పుంజుకుంటే మాత్రం.. ఈటల రాజేందర్కు పరాభావం తప్పదు. ఒకవేళ ఈటల గెలిచినా తక్కువ మెజార్టీతోనే విజయం సాధిస్తారు. 5 నుంచి 10 వేల లోపు ఓట్లతోనే బయటపడుతారని అర్థం అవుతుంది.
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంచనా వేశారు. హూజూరాబాద్ మున్సిపాలిటీ, హుజూరాబాద్ మండలంలో బీజేపీకి ఓట్లు రావాలంటే కష్టమని తాము ముందుగా భావించామని... అయితే మండలానికి సంబంధించిన అన్ని రౌండ్లలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందని చెప్పారు. మొత్తం 22 రౌండ్ల వరకు ఇదే ఆధిక్యత కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ విజయం విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే టీఆర్ఎస్ ఓటమికి కారణం కాబోతోందని వివరించారు. కేసీఆర్ను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు.
హుజురాబాద్ బై పోల్ ఈటల రాజేందర్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయన విజయం.. రాజకీయ భవిష్యత్ను నిర్ధారించనుంది. అందుకోసమే విజయమో వీర స్వర్గమో అన్నట్టు ప్రచారం చేశారు. ఇటు టీఆర్ఎస్ కూడా విజయం సాధించాలని అనుకుంది. అందుకోసమే సర్వశక్తులు ఒడ్డింది. మంత్రి హరీశ్ రావు కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగారు. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతంత మాత్రంగానే ప్రచారం చేసింది.
ఇటు హుజురాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్కు జీవన్మరణ సమస్య.. గెలిచి తీరాలని పట్టుబట్టారు. రాజీనామా చేసిన సమయం నుంచి ప్రజలతో కలిసిపోయారు. జనాలకు గిప్టులు ఇస్తున్నారని అధికార పార్టీ ప్రచారం చేసినా.. నిలువలేదు. వాస్తవానికి అక్కడ టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈటల రాజేందర్ గెలుస్తాడని అంతా భావించారు. కానీ మెజార్టీ మాత్రం ఈ స్థాయిలో వస్తుందని అనుకోలే.. ఊహించలేదు. 10 వేల లోపు మెజార్టీ వస్తుందని అంతా అంచనా వేశారు. కానీ ఈటల రాజేందర్.. కారుకు పంక్చర్ చేయడంతో కమలం వికసించింది.