వర్షాలు... వరద గండం... ఆ ఇద్దరికీ తృటిలో తప్పిన ప్రమాదం...
తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అధిక వర్షపాతంతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిచోట్ల వాగులు,చెరువులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్-జాగిర్ పల్లి మధ్య కల్వర్టును చెరువు వరద ముంచెత్తింది. చెరువు మత్తడి దూకడంతో కల్వర్టు పైనుంచి వరద ప్రవహించింది.
ఈ క్రమంలో ఇద్దరు యువకులు బైక్పై కల్వర్టును దాటే ప్రయత్నం చేయగా... వరద ఉధృతికి అందులోనే పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. ఓ తాడు సాయంతో బైక్తో పాటు వారిని వరద ప్రవాహం నుంచి బయటకు లాగారు. బయటకు వచ్చాక... ఏ ఊరు మీది..? అని ఆ మత్స్యకారులు ప్రశ్నించగా.... సమాధానం చెప్పకుండానే అక్కడినుంచి జారుకున్నారు. ఏదేమైనా మత్స్యకారుల సమయస్పూర్తితో ఆ ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ కూడా వరద నీటిలో గల్లంతైన సంగతి తెలిసిందే.సిద్దిపేట జిల్లా శనిగరం, బద్దిపల్లి రోడ్డులోని మద్దికుంట వాగులో శ్రీనివాస్ నడుపుతున్న ఇన్నోవా వాహనం కొట్టుకుపోయింది. ముగ్గురు స్నేహితులతో కలిసి మంథని నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై కారులో ఉన్న ముగ్గురిని రక్షించారు. అయితే శ్రీనివాస్ మాత్రం కారుతో పాటే వరద ఉధృతిలో గల్లంతయ్యారు.
Recommended Video
కాగా, ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా అప్రమత్తమయ్యారు. జిల్లాలవారిగా మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు












Click it and Unblock the Notifications