ఈటల రాజీనామా చేస్తే..? హుజురాబాద్ గులాబీ దళ అభ్యర్థి ఇతనే, ఎవరంటే..
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం. అయితే ఈటలపై అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతుంది. చాలా మంది పేర్లు వినిపిస్తోన్న.. చివిరికీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలతో ప్రయోగాలు చేసే కంటే వినోద్ కుమార్ నయమని గులాబీ దళంలో జోరుగా గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇతర పార్టీల నుంచి చేరేందుకు క్యూ..
కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరి పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. వీరి కంటే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ బలమైన అభ్యర్థిగా ఉంటారని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నదని సమాచారం. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు హుజూరాబాద్ కమలాపూర్ నియోజకవర్గంగా ఉండేది. వినోద్కుమార్ హన్మకొండ ఎంపీగా గెలుపొందిన సమయంలో కమలాపూర్ ఆ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి వినోద్ గెలుపొందారు. ఇక్కడ విస్తృత పరిచయాలు, నేతలతో సంబంధాలు వినోద్కుమార్కు ఉన్నాయి.
వినోదే ధీటు..
ఈ అంచనా ప్రకారం ఈటలకు దీటైన అభ్యర్థి వినోద్ కుమార్ అవుతాడని టీఆర్ఎస్ హై కమాండ్ భావిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా, వ్యూహపరంగా వినోద్కుమార్ మాత్రమే ఈటలకు సమ ఉజ్జీగా ఉంటారని పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలపై విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్ వెంటనే ఆయనను మంత్రిత్వశాఖనుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
రాజీనామా తప్పదు..
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రాణాల కంటే ఆత్మాభిమానానికే ఎక్కువ విలువ ఇస్తానని చెప్పిన ఈటల పార్టీ నుంచి బహిష్కరించే వరకు ఎదురుచూడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు టీఆర్ఎ స్కూడా ఏం జరుగుతుందోనని పరిణామాలను పరిశీలిస్తోంది. ఈటల రాజీనామా చేస్తే ఆయనను రాజకీయంగా శాశ్వతంగా ఇంటికి పంపించాలనే ధృడమైన భావనతో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వినోద్కుమార్ గెలిస్తే తర్వాత ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. కేటీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఆయనకు పాలనలో సలహాలిస్తూ వినోద్కుమార్ కుడి భుజంగా ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఓడిపోయినా.. పదవీ
కరీంనగర్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత వినోద్కుమార్ సేవలను పార్టీకి రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఆయనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మంత్రిగా అవకాశం దక్కక పోయినా ఇదే ఉన్నత పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు పదవుల ద్వారా ఆయన నియోజకవర్గానికి, ప్రజలకు ఎక్కువ సేవలు అందించగలుగుతారు. కేసీఆర్, కేటీఆర్లో ఎవరు సీఎంగా ఉన్నా వినోద్కుమార్ ప్రాధాన్యం తగ్గదని, ఆయనను గెలిపిస్తేనే నియోజకవర్గానికి లాభమని టీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేసే అవకాశమున్నది. ఈటల రాజీనామా చేసినా చేయక పోయినా ఏ పరిస్థితినైనా బలంగా తిప్పికొట్టాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయాలు అంతే పకడ్బందీగా తీసుకుంటున్నట్లు తెలిసింది.
ధిక్కరిస్తే ఇంతే మరీ అని...
ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించడం ద్వారా పార్టీలో ధిక్కార స్వరాలను వినిపించే నేతలందరికి కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనను ఓడించడం ద్వారా అటు వంటి వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో అందరికీ తెలియజెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్తో టచ్లో ఉండి ఈటల రాజీనామా చేస్తే తమకు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనపై పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారని తెలిసింది. వారి అభ్యర్థనను పరిశీలిస్తామని చెబుతూనే పార్టీలో ఈటలకు ధీటైన వారు ఎవరెనున్నారే కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ ఆ నియోజకవర్గంతో ఉన్న సంబంధం ఆయనను గెలిపిస్తుందని భావిస్తున్నారు.