అద్దె ఇళ్లు అడ్డాగా.. దొంగ నోట్ల దందా.. 7 కోట్ల మేర ఫేక్ కరెన్సీ..!
ఖమ్మం : చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుగా ఖమ్మం జిల్లాలో దొంగ నోట్ల ముఠా రెచ్చిపోయింది. మోసాలు చేయడమే వృత్తిగా మలుచుకున్న ఓ మాయగాడు నకిలీ నోట్ల పేరుతో వల విసురుతూ కోట్ల రూపాయలు దండుకున్నాడు. పక్కా సమాచారంతో సదరు మోసగాడి స్థావరాలపై దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు అవాక్కయ్యారు. గుట్టలకొద్దీ ఫేక్ కరెన్సీ దర్శనమివ్వడంతో విస్తుపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ మదార్ ఈ ముఠాకు సూత్రధారిగా గుర్తించారు. 7 కోట్ల రూపాయల మేర ముద్రించిన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఫేక్ కరెన్సీతో జనాలకు కుచ్చుటోపి
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన 53 ఏళ్ల షేక్ మదర్ కొన్నాళ్లుగా ఫేక్ కరెన్సీ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అసలు కరెన్సీ తీసుకుని దాని స్థానంలో పది రెట్లు దొంగ నోట్లు ఇస్తానంటూ నమ్మించి బురిడీ కొట్టిస్తున్నాడు. ఆ క్రమంలో కలర్ జిరాక్స్ నోట్లను అందిస్తూ ఒరిజినల్ కరెన్సీని అందినకాడికి దండుకుంటున్నాడు. చివరకు టాస్క్ఫోర్స్ పోలీసులకు విషయం తెలియడంతో దాదాపు మూడు నెలల నుంచి రెక్కీ నిర్వహించారు. మదర్కు సంబంధించిన స్థావరాలపై దాడి చేయడంతో నకిలీ నోట్ల దందా వెలుగు చూసింది.
శివసేనకు ఎన్సీపీ జై కొట్టేనా.. సీఎం కుర్చీ బీజేపీ చేజారేనా?
15 ఏళ్లుగా వ్యాపారం.. దొంగ నోట్లతో మోసం
15 ఏళ్ల నుంచి ఇదే వృత్తిగా పెట్టుకున్న మదార్ ఇప్పటివరకు దొంగ నోట్లతో చాలామందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో రాజబాపయ్య వీధిలోని పాత ఇంటిని తీసేసి రాజీవ్ నగర్లో విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. అయితే దొంగ నోట్ల దందా కోసం పలు ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని తన అనుచరులతో గుట్టు చప్పుడు కాకుండా ఫేక్ కరెన్సీ వ్యాపారం యధేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్పెషల్ నిఘా విభాగం పోలీసులు అక్టోబర్ 26వ తేదీన గౌరిగూడెంలోని మదార్కు చెందిన స్థావరంపై దాడి చేయగా 40 లక్షల రూపాయల కరెన్సీ పట్టుబడింది. అలాగే ఇతర సందర్భాల్లోనూ రెండు మూడు సార్లు దాడులు చేసి నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
మదార్ మోసాల చిట్టా
ఫేక్ కరెన్సీ దందాలో సిద్దహస్తుడిగా ముద్రపడ్డ మదార్.. రకరకాలుగా మోసాలకు పాల్పడ్డాడు. తన అనుచరులతో సామ్రాజ్యం విస్తరించుకున్నాడు. తెల్ల నోట్ల కట్టలకు పైన, కింద అసలు నోట్లను పెట్టి అమాయకులను మోసగించడం పనిగా పెట్టుకున్నాడు. పార్టీలతో మాట్లాడుకుని కరెన్సీ మార్చుకునే క్రమంలో అతడి ముఠాలోని సభ్యులే కొందరు పోలీసులుగా అవతారమెత్తి అటాక్ చేసేవారు. అలా అసలు నోట్లను కాజేసేవాడు మదార్. ఈ విధంగా పలువురిని మోసం చేసినట్లు వెల్లడైంది.
హరీశ్ రావుకు చేదు అనుభవం.. మంత్రిని తాకిన ఆర్టీసీ సెగ..!
టోకెన్ అమౌంట్ ఇస్తే గానీ..!
ఒరిజినల్ కరెన్సీ ఇస్తే దొంగ నోట్లు ఇస్తానంటూ నమ్మించే మదార్ తన కస్టమర్లకు రకరకాల మాటలు చెప్పేవాడు. అయితే తన దగ్గరకు ఫేక్ కరెన్సీ కావాలంటూ వచ్చే వారు టోకెన్ అమౌంట్ కింద కొంత చెల్లిస్తే గానీ వారికి నోట్ల పెట్టెలు చూపించేవాడు కాదని ఖమ్మం పోలీస్ కమిషనర్ ఇక్బాల్ శనివారం నాడు మీడియా సమావేశంలో వెల్లడించారు. తన దగ్గరకు వచ్చినవారు అక్కడున్న నోట్ల కట్ట నుంచి ఎన్నుకున్నదాంట్లో ఒక తెల్ల నోటు తీసి ద్రావణంలో ముంచుతాడు. అలా అది కరెన్సీలా మారిందని చూపించి నోట్ల పెట్టెలు అందించేవాడట. మొత్తానికి మదార్ దొంగ నోట్ల వ్యాపారం గుట్టురట్టు కావడంతో అతడికి సహకరించిన భార్య, కొడుకును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు.