శభాష్ సజ్జనార్: పొరుగురాష్ట్రంలోని అనాథ వృద్దులపై కరుణ, ఉచిత ప్రయాణం..
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమూల మార్పులు జరుగుతున్నాయి. సంస్థలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం దిశగా ఉన్నాయి. ఏ సమస్య అయినా సరే ట్వీట్ చేస్తే చాలు.. సజ్జనార్ స్పందిస్తున్నారు. రియాక్ట్ కావడం కాదు పరిష్కారం చేస్తున్నారు. జర్నలిస్టుల 2/3 బస్ పాస్ ఆన్ లైన్ కూడా చేశారు. తమ ఊరికి బస్సు లేదోయ్ బాబూ.. అంటే చాలు.. వెంటనే రయ్యి రయ్యి మని ప్రగతి రథ చక్రాలు వస్తున్నాయి. అలాగే వృద్దులు, నిరుపేదలపై సజ్జనార్ తన మంచి మనసును చాటుకుంటున్నారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి ఔదార్యం చూపారు. అనాథ వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అదీ కూడా పొరుగు రాష్ట్రం నుంచి.. ఉచిత ప్రయాణం అందించారు. వారు భద్రాచలం రామయ్య దర్శనం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వావివలస గ్రామానికి చెందిన పాలూరు సిద్ధార్థ తన భార్య సుధారాణితో కలిసి ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అనాథలు, దివ్యాంగ మహిళలకు అండగా ఉంటూ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.
అక్కడ నివసిస్తున్న కొందరు వృద్ధురాళ్లకు భద్రాచలం రామయ్యను దర్శించుకోవాలనేది చిరకాల కోరిక. దీంతో సిద్ధార్థ తన పరిచయస్తుల ద్వారా విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సజ్జనార్ విశాఖపట్నం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి పర్ణశాల, తిరిగి విశాఖపట్నం వరకు పూర్తిగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈ మేరకు 20 మంది వృద్ధురాళ్లు గురువారం ఉదయం భద్రాచలం చేరుకుని పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాక రామయ్యను దర్శించుకున్నారు.
అనంతరం పర్ణశాలను కూడా సందర్శించారు. వీరికి భద్రాచలం పట్టణ సీఐ టి.స్వామి భోజన, వసతి, ఆలయ ఈవో శివాజీ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తమ చిరకాల కోరిక తీర్చిన ఎండీ సజ్జనార్, ఏర్పాట్లు చేసిన అధికారులకు వృద్ధురాళ్లు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత వారు విశాఖపట్టణం తిరుగు పయనమయ్యారు.