కుప్పం రైల్వే స్టేషన్లో విషాదం.. భార్య కళ్లెదుటే ప్రాణాలు వదిలిన భర్త... కరోనా నెగటివ్ వచ్చినా...
చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి కుప్పం రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. తన కళ్ల ఎదుటే చనిపోయిన భర్తను చూసి ఆ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.
వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం మిద్దూరుకు చెందిన చంద్రశేఖర్-లక్ష్మీ దేవి దంపతులు బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం కర్ణాటక వలస వెళ్లారు. అక్కడే కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది కాలంగా వ్యాపారం సరిగా సాగట్లేదు. కరోనా సెకండ్ వేవ్లో కర్ణాటకలో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు.

ఆ తర్వాత కొద్దిరోజులకే చంద్రశేఖర్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఏప్రిల్ 23న కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మంగళవారం(మే 4) నిర్వహించిన కరోనా టెస్టుల్లో కోవిడ్ నెగటివ్గా తేలడంతో డిశ్చార్జి అయ్యాడు.ఇదే క్రమంలో గురువారం దంపతులు ఇద్దరు బెంగళూరు వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం కుప్పం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
రైలు వచ్చే సమయం ఇక ఆసన్నమవగా చంద్రశేఖర్ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. చూస్తుండగానే క్షణాల్లోనే భార్య కళ్ల ఎదుటే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లోని తోటి ప్రయాణికులను తీవ్రంగా కలచివేసింది. ఘటన గురించి తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే... గడిచిన 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,188 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,45,374కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,260 పాజిటివ్ కేసులు, విశాఖ జిల్లాలో 1,868 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 385 కేసులు వెల్లడయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 73 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8,519కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications