వైసీపీలో కలకలం.. ఎమ్మెల్యే రాజీనామా...!? పార్టీ నిర్ణయంతో మనస్థాపం : నేతల చివరి ప్రయత్నాలు..!
ఏపీ అధికార పార్టీలో కలకలం. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. నియోజకవర్గంలో తన మాటకు విలువ లేకుండా..తనకు ప్రతీ విషయంలో అడ్డు పడుతూ..వివాదాలకు కారణమవుతున్న వారి మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. దీని పైన పార్టీ నేతలు ఎమ్మెల్యే ఆర్దర్ తో పాటుగా యువ నేత బైరెడ్డి సిద్దార్ద రెడ్డి మధ్య రాజీ కోసం ప్రయత్నాలు చేశారు.

రాజీనామా దిశగా అడుగులు
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ పర్యటన సమయంలోనూ వివాదాలకు కారణమవుతున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. దీని పైన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ సైతం ఇద్దరితోనూ మాట్లాడారు. అయినా..సిద్దార్ద రెడ్డి తీరు మారలేదని..అదే సమయంలో తన కంటే సిద్దార్ద రెడ్డి సిఫార్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన నియోజకవర్గంలో ప్రభుత్వం నియమించిన మార్కెట్ యార్డు పాలకవర్గంలో పూర్తిగా సిద్దార్ద రెడ్డి సిఫార్సు చేసిన వారికే అవకాశం కల్పించటం పైన ఎమ్మెల్యే ఆర్దర్ మనస్థాపానికి గురయ్యారు. దీంతో..ఆయన రాజీనామా దిశగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం

2019లో తొలి సారి ఎమ్మెల్యేగా..
ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్దర్ వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఐజయ్య అక్కడ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ, 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ నందికొట్కూరు నుండి ఆర్దర్ కు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా..తన కంటే అక్కడ సిద్దార్ద రెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆర్దర్ పలు మార్లు ఆవేదనకు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని పార్టీ ముఖ్య నేతల వద్ద వివరించారు. తాజాగా జరిగిన యార్డు పాలక వర్గం నియామకం ద్వారా ఆర్దర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సిద్దపడినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం ఆయన ఈ రోజు తన నిర్ణయం ప్రకటించేందుకు మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు.
Recommended Video


రంగంలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ఇప్పటికే జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రితో పాటుగా జిల్లా వ్యవహారాలు చూస్తున్న పార్టీ ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి సైతం ఎమ్మెల్యేతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అన్ని విషయాలు చర్చిద్దామని..ఎటువంటి నిర్ణయాలు ప్రకటించవద్దని సూచించినట్లుగా సమాచారం. అయితే, ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం తమ ఎమ్మెల్యేకు పార్టీలో విలువ ఇవ్వటం లేదని వాపోతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు కర్నూలు జిల్లాలో వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. పార్టీ ముఖ్య నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో.. ఎమ్మెల్యే ఆర్దర్ తన రాజీనామా ఆలోచన విరమించుకుంటారా లేక ప్రకటన చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications