చంద్రబాబు మెడకు చుట్టుకుంటోన్న టీటీడీ, శ్రీశైలం అన్యమత వ్యవహారం..! తవ్వి తీస్తోన్న వైసీపీ
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అన్యమత ప్రచారం తీవ్రమైందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా కొనసాగుతోన్న ప్రచార పర్వం బూమరాంగ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నంలో భాగంగా- అధికార వైఎస్ఆర్సీపీ కొన్ని కీలకమైన ఆధారాలను వెలికి తీసే పనిలో పడింది.. తీస్తోంది కూడా. ప్రత్యేకించి- కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో అన్యమతస్తులు, హిందూయేతర వ్యక్తులను ఉద్యోగులుగా నియమించింది చంద్రబాబు ప్రభుత్వమేనంటూ సాక్ష్యాధారాలను బహిర్గతం చేస్తోంది. దేవస్థానం విధి నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హిందూయేతర వ్యక్తులను ఉద్యోగులుగా నియమించిన ఘటనకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

శ్రీశైలంలో 20 మంది వరకు?
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 17 నుంచి 20 మంది ఉద్యోగులను ఆలయ సిబ్బందిగా నియమితులయ్యారు. వారిలో ముగ్గురు శాశ్వత ప్రాతిపదికన నియమితులు కాగా.. మిగిలిన వారు తాత్కాలిక ఉద్యోగులుగా ధృవీకరించారు. దీనికి సంబంధించిన ఓ కీలక నివేదికను దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ రామరావు ఓ నివేదికను రూపొందించారని, దాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ పద్మకు అందజేసినట్లు సమాచారం. మొత్తం ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? వారిలో వ్యక్తిగత వివరాలేంటీ? అన్యమతస్తులు ఎంతమంది ఉన్నారు? అనే విషయాలను కార్యనిర్వహణాధికారి ఈ నివేదికలో పొందుపరిచినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఈ నివేదికను కార్యనిర్వహణాధికారి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. శ్రీశైలం మాత్రమే కాకుండా.. దాదాపు అన్ని ఆలయాలపైనా నిఘా ఉంచినట్లు సమాచారం.

టీటీడీలోనూ ఇదే తంతు?
కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న పరమ పవిత్ర తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలోనూ అన్యమతస్తులు ఉద్యోగాలు పొందిన ఉదంతం చంద్రబాబు హయాంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంలో సీనియర్ క్లర్క్ స్థాయి ఉద్యోగి ఒకరు.. తాను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించే టీటీడీ వాహనంలో చర్చికి వెళ్లిన ఉదంతం ఇదివరకు తిరుపతిలో బహిర్గతమైంది. టీటీడీ అధికారిక వాహనంలో సదరు ఉద్యోగి చర్చికి వెళ్లడం, చర్చి ఆవరణలో టీటీడీ అనే పేరున్న వాహనాన్ని పార్క్ చేసి ఉంచడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ లా మారాయి. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం టీటీడీ అధికారులు ఆయనను తొలగించారు. దీనిపై ఆ ఉద్యోగి న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో ఏకంగా 45 మంది అన్యమతస్తులు తిరుమలలో ఉద్యోగాలు చేపట్టినట్లు తేలింది. ఈ 45 మంది అన్యమతస్థ ఉద్యోగులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

బస్ టికెట్ల వ్యవహారం.. గతాన్ని తవ్వుతున్న అధికార పార్టీ
తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక జెరూసలేం, హజ్ యాత్రకు సంబంధించిన ప్రకటనకు సంబంధఇంచిన వివాదం రాష్ట్రంలో దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా జారీ చేసిన ప్రకటనలు ఇవి. జెరూసలేం, హజ్ యాత్రలకు వెళ్లే క్రైస్తవులు, ముస్లింలకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖక అందించే ఆర్థిక సహాయాన్ని ఉటంకిస్తూ ముద్రించిన ఈ ప్రకటనలను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ముద్రించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఈ ఘటన తరువాత- చంద్రబాబు హయాంలో దేవాలయాల్లో అన్యమతస్తుల నియామకాలపై ఆరా తీయాలంటూ ప్రభుత్వం ఆదేశించారు. ఇందులో భాగంగానే- శ్రీశైలంలో సుమారు 20 మంది హిందూయేతర ఉద్యోగులు నియమితులైనట్లు అధికారులు గుర్తించారు.

సీఎస్.. సీరియస్
పవిత్రమైన హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగాలు పొందిన ఉదంతంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. తిరుమల ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై ఓ సమగ్ర నివేదికను రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం ఘటనలో నెల్లూరు ఆర్టీసీ స్టోర్స్ విభాగం కంట్రోలర్ జగదీశ్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. నెల్లూరు జిల్లాలోని డిపోలకు మాత్రమే వినియోగించాల్సిన ఆ బస్ టికెట్లను తిరుమల తిరుపతి డిపోలకు సరఫరా చేయడం వెనుక జగదీశ్ బాబు హస్తం ఉన్నట్లు తేలిందని ఆర్టీసీ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications