యాదాద్రి పనుల్లో జాప్యం.. సీరియస్ అయిన సీఎం కార్యాలయం
యాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి వైపు ప్రపంచం దృష్టి మరల్చేలా కసరత్తు చేస్తోంది. 2వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. అయితే పనుల్లో జాప్యం జరుగుతోందంటూ కాంట్రాక్టర్లపై సీఎంవో కార్యాలయం సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకారం స్వామివారి నిజదర్శనాలు కలిపించేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించింది.

2వేల కోట్లు.. తుదిదశకు పనులు
వాస్తు, ఆగమశాస్త్ర ప్రకారం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరుగుతోంది. మరో రెండు మూడు నెలల్లో ప్రధాన ఆలయం పనులు పూర్తికానున్నాయి. దీనికోసం దాదాపు 2వేల మంది శిల్పులు నిరంతరం పనిచేస్తున్నారు. 2వేల కోట్ల రూపాయల అంచనాతో తలపెట్టిన ఆలయ పునర్నిర్మాణం పనులు తుదిదశకు వచ్చాయి. ఇప్పటికే 1800 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆకృతులు కొలువుదీరనున్నాయి.
ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దేలా ప్లాన్ రూపొందించారు. ఆగమ, వైదిక నియమాలు, ఆకట్టుకునే శిల్పకళాకృతులు.. ఇలా ప్రతి అంశంలో యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. పునాది నుంచి మొదలు శిఖరాగ్రం వరకు రాతిశిల్పాలతో నిర్మాణం జరుగుతుండటం విశేషం.

పనుల్లో జాప్యమెందుకు..! సీఎంవో సీరియస్
అనుకున్న సమయానికి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరగాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. షెడ్యూల్ ప్రకారం స్వామివారి నిజదర్శనాలు ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈమేరకు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనుకున్నదాని ప్రకారం పనులు జరగడం లేదని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామన్న కొన్ని పనుల్లో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు. ఆలయ ప్రాకారాలతో పాటు రాజగోపురాలను పరిశీలించారు. ముఖ మండపంలో దాదాపు 3 గంటలకు పైగా అధికారులతో చర్చలు జరిపారు. పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు.

3 నెలల్లోగా ప్రధాన ఆలయం.. 1200 గజాల్లో కోనేరు
ప్రధాన ఆలయంలో గర్భాలయం, ముఖ మండపం, అంతర్గత ప్రాకారం, ఏడు గోపురాలకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ విస్తరణతో పాటు పునర్నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. మరో 2నెలల్లో ప్రధాన ఆలయ నిర్మాణం ప్రారంభించి.. నెలరోజుల్లోపు పూర్తిచేసేలా సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఆలయ పునర్నిర్మాణం దృష్ట్యా కోనేరును విస్తరించనున్నారు. ప్రస్తుతం 300 గజాల్లో ఉన్న కోనేరును 1200 గజాల్లో విశాలంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి 2నెలల్లోగా సివిల్ పనులు పూర్తిచేసేలా కసరత్తు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నాటికి కోనేరు పనులు పూర్తిచేసి స్వామివారి చక్రతీర్థ స్నానం చేపట్టాలనే పట్టుదలతో ఉన్నారు.












Click it and Unblock the Notifications