బార్లు, బీర్లు, బెల్ట్ షాపులు కేసీఆర్ మాట.. ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగం.. మా మాట: షర్మిల
బార్లు, బీర్లు, బెల్ట్ షాపులు టీఆర్ఎస్ పార్టీ నినాదాలైతే.. ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగాలు YSR తెలంగాణ పార్టీ నినాదాలు అని షర్మిల అన్నారు. ఆనాడు వైయస్ఆర్ పక్కా ఇండ్లు నిర్మిస్తే.. నేడు కేసీఆర్ ఇంటి పన్ను వసూలు చేస్తున్నాడు అని ఫైరయ్యారు. ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 37వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండల కేంద్రంలో పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కోటమర్తి, శ్రీరాంనగర్, చిర్రగూడూరు గ్రామాల మీదుగా సాగింది. అనంతరం తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించి, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

చార్జీల మోత..
వైయస్ఆర్ ఒక్క చార్జీ పెంచకుండా పాలన సాగిస్తే.. కేసీఆర్ కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఫైరయ్యారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇస్తడు.. వాటిని నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దన్నారు. ఎనిమిదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు అటకెక్కించి, గారడి మాటలతో మభ్యపెడుతున్నాడని ఫైరయ్యారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం మోసపూరిత హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత ఎవరినీ గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. దళితులను అడుగడుగునా మోసం చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అన్నారు.

అప్పులు.. ఆత్మహత్యలే శరణ్యం..
రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీలేని రుణాలు, నిరుద్యోగ భృతి, వృద్ధ్యాప్య పెన్షన్ల అమలుపై కేసీఆర్ నిర్లక్ష్యం చూపారని తెలిపారు.కేసీఆర్ పాలనలో అప్పులు, ఆత్మహత్యలే మిగిలాయన్నారు. కేసీఆర్ కేవలం పదవీ కోసం, ఆయన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రూ.4 లక్షల కోట్ల అప్పు తెచ్చి, ప్రతీ కుటుంబం మీద రూ.4 లక్షల అప్పు పెట్టారని ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హామీలు ఇస్తారని.. నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దని సూచించారు.

వరి కూడా వేసుకోవద్దట..
ఇప్పుడు కేసీఆర్ వరి కూడా వేసుకోవద్దని అంటున్నారు. రైతు తనకు నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదన్నారు. వరి వేయద్దని చెబుతున్న కేసీఆర్, ఉచిత విద్యుత్ ఎందుకు పెట్టినట్టు? లక్షల కోట్ల ప్రజాధనంతో ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్లు? ఇవన్నీ కమీషన్ల కోసమే కదా? అని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ పార్టీ నాయకులు.. నేడు కేసీఆర్ కరెంటు ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలపై ఫైరయ్యారు. రాష్ట్రంలో అన్ని ఛార్జీలు, పన్నులు పెంచేసిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని ధర్నా చేస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications