ఈసారి నెల్లూరు రొట్టెల పండుగ రద్దు... భక్తులెవరూ రావొద్దన్న అధికారులు..
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏటా ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ జరగాల్సిన బారాషహీద్ దర్గా ఉరుసు మహోత్సవాల్లో కరోనా కారణంగా కొన్ని మార్పులు చేశారు. రొట్టెల పండుగను రద్దు చేసిన అధికారులు గంధోత్సవం మాత్రం కొనసాగుతుందని ఇవాళ ప్రకటించారు. అందులోనూ కేవలం 20 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతిచ్చారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు రావొద్దని అధికారులు కోరుతున్నారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలో ఏటా మొహర్రం మాసంలో నిర్వహించే సంప్రదాయ రొట్టెల పండుగ చాలా ప్రత్యేకమైనది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు తీసుకుని మొక్కుకోవడం, మొక్కు తీరాక మళ్లీ రొట్టెలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. చదువు, ఆరోగ్యం, వివాహాలు, ఇతరత్రా రొట్టెలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏది కావాలన్నా ఉచితంగా రొట్టెను తీసుకుని మొక్కు కోవచ్చు. తిరిగి మొక్కు తీరగానే తాము కూడా తిరిగి అలాంటి రొట్టెనే కావాల్సిన వారికి ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత.
ఏటా జరిగే రొట్టెల పండుగకు ప్రభుత్వాలు, స్ధానిక అధికారులతో కలిసి భారీ ఏర్పాట్లు చేస్తుంటాయి. ముస్లింలతో పాటు ఇతర మతాల వారూ ఎంతో పవిత్రంగా భావించే ఈ రొట్టెల పండుగను వాయిదా వేయక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో భక్తులు కూడా ఈసారి నిరాశ చెందుతున్నారు.