రూ.100 కోట్లకు డీల్ కుదుర్చుకున్న రవితేజ?
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోయే హీరోల్లో రవితేజ ముందువరుసలో ఉంటారు. సినిమాలు ఫ్లాపైనా ఆయనికిచ్చే రెమ్యునరేషన్ వల్ల వర్కౌట్ అవుతుండటంతో నిర్మాతలు రవితేజ అడిగినంత ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు రూ.5 నుంచి రూ.10 కోట్లమేర ఆయన తన రెమ్యునరేషన్ పెంచారు. కరోనా టాక్స్ కూడా వేస్తున్నారంటూ కొందరు నిర్మాతలు రవితేజపై ఛలోక్తులు వేస్తుంటారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో రవితేజ రూ.100 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు అని. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ అనే సినిమాని ఆయన చేస్తున్నారు. పీపుల్స్ సంస్థే దీన్ని నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర నిర్మాత మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ వేగంగా 100 సినిమాలు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే రవితేజతో నాలుగు సినిమాలను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ సమయంలోనే నిర్మాతలతో రవితేజకు మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈగల్ సినిమాతోపాటు మరో మూడు సినిమాలకు ఒప్పందం కుదిరింది. అందుకు రెమ్యునరేషన్ రూ.25 కోట్ల చొప్పున రూ.100 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కలర్ ఫోటో ఫ్రేమ్ దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉంది.

మరో రెండు సినిమాలకు సంబంధించిన కథలు, దర్శకులను ఫైనల్ చేయాల్సి ఉంది. మొత్తం మీద 100 సినిమాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు రవితేజ లాంటి మార్కెట్ ఉన్న హీరో దొరకడంతో వాళ్లు ఆయననే లాక్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించుకునే అవకాశం దొరకడంతో రవితేజ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications