కాలేజీలో కరోనా కలకలం: 163 మంది విద్యార్థులకు పాజిటివ్, కంటైన్మెంట్ జోన్గా మార్చేశారు
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ఓ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. ఆ కళాశాలలో మొత్తం 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజుల నుంచి వరుసగా 13,10 చొప్పున కేసులు నమోదు అవుతుండగా, సోమవారం ఒక్కరోజే 140 మందికి కరోనా సోకినట్లు తేలిందని డీఎంహెచ్ఓ డాక్టర్ గౌరీశ్వరరావు తెలిపారు.
ఇప్పటి వరకు సుమారు 700 మంది విద్యార్థుల నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలినవారందరినీ ఒకచోటు చేర్చి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా చేశామన్నారు. ఇక కరోనా నెగిటివ్ వచ్చిన దాదాపు 450 మందిని వేరే హాస్టల్ ఉంచామని డీఎంహెచ్ఓ తెలిపారు.

ఇది ఇలావుండగా, ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గత 24 గంటల్లో రాష్ట్రంలో 310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,94,044కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
గత 24 గంటల్లో కరోనా బారినపడి కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7191 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 114 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,84,471కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2382 యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,47,71,701 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 26, చిత్తూరులో 51, తూర్పుగోదావరిలో 43, గుంటూరులో 28, కడపలో 20, కృష్ణాలో 26, కర్నూలులో 21, నెల్లూరులో 13, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 43,
విజయనగరంలో 7, పశ్చిమగోదావరిలో 0 కరోనా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications