16 నెలలు జైలులో ఉండివచ్చిన దొంగ వైఎస్ జగన్..మీరూ పాదయాత్ర చేయండి!
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ సీనియర్ నేత, కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ను ఆయన దొంగతో పోల్చారు 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపి వచ్చారని గతాన్ని తవ్వి తీశారు. పాదయాత్ర చేయగానే దేవుడైపోయాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలంటే పాదయాత్ర చేసి తీరాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కావాలంటే పవన్ కల్యాణ్ కూడా పాదయాత్ర చేయాలని, ఆయన వెనుక తాము అండగా ఉంటామని సలహా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలంగా నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలా ఉంటేనే రానున్న ఎలాంటి ఎన్నికలనైనా సమర్థవంతంగా ఎదుర్కొన గలమని ఆయన పవన్ కల్యాణ్ కు సూచించారు. ఈ దిశగా పార్టీ అధిష్ఠానం విస్పష్ట ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.

కాకినాడ కార్యకర్తలతో సమీక్ష..
కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి తనకు నిఖార్సయిన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిాంచారు. పార్టీ నాయకులు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పంతం నానాజీ, సూర్యచంద్ర, ముత్తా శశిధర్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పంతం నానాజీ వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్ పై వ్యక్తిగత దాడి చేశారు. ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం సైతం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్దారు. ప్రజాబలం లేని ప్రభుత్వమని ధ్వజమెత్తారు.

పాదయాత్ర చేసి దేవుడయ్యాడు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 16 నెలల పాటు జైలులో ఉండివచ్చారని, ఆయన ఓ దొంగ అని అన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో తెలుసని అన్నారు. లక్ష కోట్లను అక్రమంగా సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇవన్నీ జనం నుంచి వచ్చిన మాటలేనని పంతం నానాజీ చెప్పారు. అలాంటి వ్యక్తి.. తొమ్మిది సంవత్సరాలు రోడ్లపై తిరిగితే దొర అయిపోయారని చెప్పారు. దొంగ దొరగా మారాలంటే పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. ఒక్క సంవత్సరం పాటు పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రం మొత్తం తిరగాలని సూచించారు. తాము అండగా ఉండి నడిపిస్తామని అన్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే- పాదయాత్ర చేయాలని, ప్రజల్లో ఉండాలని కోరారు. అభిమానులే పవన్ కల్యాణ్ ను నడిపించగలరని చెప్పారు. ఈ దిశగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సూచించారు.

ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం..
జిల్లా స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను మనం నియమించాల్సిన అవసరం ఉందని పంతం నానాజీ అన్నారు. ఒక రెండు నెలల్లో అవి పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్రంలో వేలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడానికి వైఎఆర్ సీపీ ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధపడుతోందని, ఇది అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోవడానికి మూడేళ్లు పడితే, వైఎస్ జగన్ కు రెండు నెలలే పట్టిందని ఆరోపించారు. రెండు నెలల వ్యవధిలోనే వైఎస్ జగన్ ప్రజల మద్దతును కోల్పోయారని, ఆయనపై, పరిపాలనపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఈ రాష్ట్రం ఎటుపోతుందో అని వ్యాఖ్యానించారని అన్నారు.

సంస్థాగత లోపాలు..
సంస్థాగతంగా పార్టీని నిర్మాణానికి సరైన సమయం లేకపోవడం, ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణమని పంతం నానాజీ తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీకి పునాదులు ఇంకా ఏర్పడాల్సి ఉందని అన్నారు. పార్టీ నిర్మాణం కొంతమేరకైనా బలంగా కొనసాగి ఉండి ఉంటే ఎన్నికల్లో ఈ దారుణ ఓటమి తప్పేదని అభిప్రాయపడ్డారు. సరిగ్గా నిర్మాణం పూర్తయ్యే దశలో ఎన్నికలు రావడమే పార్టీ ఓటమికి కారణమని తాను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి నుండి పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం చేసి బలంగా ఎన్నికలకు వెళదామని అన్నారు. పార్టీ నిర్మాణ సరిగ్గా లేకపోతే- స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ఓటమిని ఎదుర్కొనాల్సి రావచ్చని పంతం నానాజీ చెప్పారు.












Click it and Unblock the Notifications