Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి విశిష్టత, పండుగ వెనుక ఉన్న చారిత్రక నేపధ్యం ఇదే!!
రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ ఈ సంవత్సరం ఆగస్ట్ 11న వస్తుంది. అయితే ఈ ఏడాది ఆగస్ట్ 11, 12 తేదీలలో రాఖీ పండుగ జరుపుకోవటంపై గందరగోళం జరుగుతుంది.

రాఖీ పౌర్ణమిపై గందరగోళం.. భద్రా సమయంలో రాఖీ కట్టరాదని..
2022 ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి ముహూర్తం మొదటి సగం వరకు ఉంటుందని దృక్ పంచాంగ్ పేర్కొంది. ఇది ఆగస్టు 11వ తేదీ రాత్రి 8:51 గంటలకు ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారం, భద్రా (రాత్రి) సమయంలో రాఖీ కట్టకూడదు, ఎందుకంటే ఇది హానికరమైన సమయం అని నమ్ముతారు. దీనిలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెప్తున్నారు.
రాఖీని ఆగస్టు 11వ తేదీ రాత్రి 8:51 గంటల తర్వాత మరియు 12 ఆగస్టు వరకు పూర్ణిమ తిథి సమయంలో అంటే ఉదయం 7:16 గంటల వరకు కట్టవచ్చు. కానీ రాత్రి సమయంలో రాఖీ కట్టకూడదని భావిస్తున్నారు. సూర్యమానం ప్రకారం సూర్యోదయం సమయంలో ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని 12వ తేదీ జరుపుకోవాలని కొందరు పండితులు చెప్తున్నారు.

అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి విశిష్టత ఇదే
దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది.
సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షా బంధనం ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవటం వెనుక పెద్ద చరిత్రనే ఉంది. ఈ పండుగను జరుపుకునే ఆచారం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.

రాఖీ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఇదే
పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య చాలా కాలంపాటు యుద్ధం సాగింది. దాదాపు పుష్కర కాలం పాటు సాగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది.
అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది . ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది.

ద్రౌపదీ శ్రీకృష్ణుల కథ, లక్ష్మీదేవి బలిచక్రవర్తిల కథ
దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ నాటి నుండే ఆచారంగా కొనసాగుతుంది. ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడువేలుకు గాయం అయ్యిందట.
అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతికు హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక బలి చక్రవర్తి శ్రీమహా విష్ణువును పాతాళలోకానికి తీసుకువెళ్ళిన సమయంలో, ఆయనను తిరిగి తీసుకు రావటం కోసం లక్ష్మీ దేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు కథ ఉంది.

మానవ సంబంధాల మెరుగుదలకు దోహదం చేసే పండుగ రాఖీ
ప్రతి ఒక్కరు రాఖీ పండుగను తమ అనుబంధాలకు ప్రతీకగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. మానవ సంబంధాల మెరుగుదలకు, సమాజంలో ప్రస్తుతం అవసరంగా మారిన మానవ విలువలకు రాఖీ పండుగ అద్దం పడుతుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్యనే జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారు ఒకరికి ఒకరు అండగా ఉన్నామని చెప్పవచ్చు.

మార్కెట్ లో రకరకాల రాఖీల సందడి.. అన్నాచెల్లెళ్ళ హడావిడి
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి నేపధ్యంలో అంతంత మాత్రంగా జరుపుకున్న రాఖీ పండుగను ఈసారి ఘనంగా జరుపుకోవటం కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో బోలెడన్ని రాఖీల సందడి నెలకొంది. ఈ సంవత్సరం బంగారం, వెండి, రాళ్ళు పొదిగిన రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది .మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి .ఇక పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకుంటున్న వారు ఉన్నారు. సోదరులపై ప్రేమ అంత తెలిసేలా అందమైన రాఖీలను సోదరీమణులు కొనుగోలు చేస్తున్నారు. ఇక వారిపై ప్రేమను తెలియజేసేలా సోదరులు కూడా వారికి గిఫ్ట్ లు ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications