సుప్రీంపై బ్రాహ్మణుల పెత్తనం: కొలీజియం..ఓ మిస్టరీ: ఎంపీ: ఆ స్పీచ్ సూపర్: వెంకయ్య ప్రశంస
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాల్లో కేరళకు చెందిన కొత్త సభ్యుడు జాన్ బ్రిట్టాస్ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మూడు రోజుల కిందట చేసిన ప్రసంగం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో ప్రసంగించడం అదే తొలిసారి. తన తొలి ప్రసంగంలోనే ఆయన న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. కొలీజియం వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొలీజియం వల్ల న్యాయ వ్యవస్థ తన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కోల్పోతోందని కుండబద్దలు కొట్టారు.
మా నాన్నది పెద్ద మనసు: నాతో అలా ఉండదు..నేను వదిలి పెట్టను: వైసీపీకి నారా లోకేష్ వార్నింగ్
సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తొలి ప్రసంగం..
కేరళలో అధికారంలో ఉన్న సీపీఎంకు చెందిన సీనియర్ నాయకుడు జాన్ బ్రిట్టాస్. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది పార్టీ. పార్లమెంట శీతాకాల సమావేశాల సందర్భంగా మూడు రోజుల కిందట ఆయన రాజ్యసభలో ప్రసంగించారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ప్రక్రియను తప్పు పట్టారు. ఈ అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకం తీరు అభ్యంతరకమని అన్నారు.
న్యాయమూర్తులను న్యాయమూర్తులే అపాయింట్మెంట్..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ఉందని చెప్పారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే పద్ధతి మరెక్కడా లేదని జాన్ బ్రిట్టాస్ స్పష్టం చేశారు. అసలు న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ సరిగా లేదని, అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకం అనువంశికంగా మారిందని, ఇది ఏ మాత్రం వాంఛనీయం కాదని చెప్పారు.
జస్టిస్ అకిల్ ఖురేషీ ఏం తప్పు చేశారు?
జస్టిస్ అకిల్ ఖురేషీ ఏం తప్పు చేశారని, ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేయలేదని జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. ఓ శక్తిమంతుడైన నాయకుడిని జైలుకు పంపించడమే ఆయన చేసిన తప్పా? అని నిలదీశారు. అందుకే ఆయనను సుప్రీంకోర్టుకు నామినేట్ చేయలేదని అనుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 47 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులు కాగా.. వారిలో 14 మంది బ్రాహ్మణులే ఉన్నారని అన్నారు.
Recommended Video
1980 వరకు ఓబీసీలు, ఎస్సీలు లేరు..
1950 నుంచి 1970 మధ్యకాలంలో సుప్రీంకోర్టులో గరిష్ఠంగా 14 మంది న్యాయమూర్తులు పనిచేశారని, వారిలో 11 మంది బ్రాహ్మణులే ఉన్నారని జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. 1980 వరకు ఒక్క ఓబీసీ గానీ, ఎస్సీ గానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాలేకపోయారని గుర్తు చేశారు. కొలీజియం వ్యవస్థ అనేది ఓ మిస్టరీగా మారిందని జాన్ బ్రిట్టాస్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా న్యాయమూర్తులను న్యాయమూర్తులే అపాయింట్ చేసుకునే వ్యవస్థ భారత్లో ఉందని అన్నారు.