దారుణం: 64 రోజుల ఉపవాసం, 13 ఏళ్ల బాలిక బలి, తపస్సులో భాగమేనని..
హైదరాబాద్: అరవై నాలుగు రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి, మృతి చెందిన ఆరాధన (13) సంఘటన వివాదాస్పదమైంది. మూఢాచారాలకు బాలికను బలిచేశారనీ, తల్లిదండ్రుల ఒత్తిడితోనే బాలిక దీక్ష చేపట్టిందంటూ బాలల హక్కుల సంఘం పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసింది.
అర్థం లేని నమ్మకాలు, తల్లిదండ్రుల అమానవీయ నిర్ణయాల వల్ల బాలిక ప్రాణాలు పోయాయి. మత గురువులు ఆదేశించారని తల్లిదండ్రులు బాలికను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చోబెట్టారు. అచ్చం దేవకన్యలా తయారు చేశారు. కానీ ఆ బాలిక ఆకలిని మాత్రం చూడలేకపోయారు.
ఏకంగా 64 రోజుల పాటు ఏం తినకుండా ఉన్నది. ఆమె నీళ్లు మాత్రమే తాగేది. ఈ సంఘటన సికింద్రాబాదులోని పాట్ బజార్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ బంగారు నగల వ్యాపారి లక్ష్మీచంద్, మనీషా దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఆరాధన 13 ఏళ్ల కూతురు.
ఓ ప్రయివేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. వారి మత ఆచారం ప్రకారం ఆరాధనను 64 రోజుల పాటు ఉపవాస దీక్షకు కూర్చోబెట్టారు. ఆమె దీక్ష అక్టోబర్ 1వ తేదీన ముగిసింది. దీక్ష సమయంలో సాయంత్రం ఆరు గంటల లోపు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది.
అనేకసార్లు ఆమె స్పృహ కోల్పోయినా పట్టించుకోలేదు. ముగింపు సంబరాలను ఘనంగా నిర్వహించారు. దీనికి కొందరు ప్రముఖులు కూడా హాజరయ్యరని తెలుస్తోంది. ఉపవాస దీక్ష ముగిసిన మూడో రోజున ఈ నెల 3వ తేదీన బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ అదే రోజు మరణించింది. దీనిపై బాలల హక్కుల సంఘం నాయకులు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మృతికి కారణమైన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నార్త్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సహజమరణంగానే భావిస్తున్నాం
తపస్సులో భాగంగానే తమ కుమార్తె చనిపోయిందంటూ ఆరాధన తల్లిదండ్రులు లక్ష్మీచంద్, మనీషాలు చెప్పారు. వ్యాపారంలో లాభాల కోసమే కుమార్తెతో తపస్సు చేయించామనడం వాస్తవం కాదన్నారు. గతంలో తమ తల్లి 37 రోజులు తపస్సు చేశారని, ఇదంతా దైవకృప కోసం అనాదిగా తమ మతం అనుసరిస్తున్న సంప్రదాయమన్నారు.
బాలిక బంధువు దినేష్ జైన్ మాట్లాడుతూ... మీడియాలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారన్నారు. బాలిక చనిపోవడం బాధాకరమే అయినా, దీనిని తాము సహజ మరణంగా భావిస్తున్నామన్నారు.