పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి
రంగారెడ్డి: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా కొల్లాపూర్ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల వద్ద బుధవారం నార్లపూర్ భూగర్భ పంప్హౌజ్లోకి పోయే టన్నెల్లో పేలుడు చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మొత్తం 18 మంది ఉండగా.. అందరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స హైదరాబాద్కు తరలించినట్టు సీఈ లింగరాజు వెల్లడించారు.

సొరంగంలో ఇంకొంతమంది చిక్కుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సొరంగంలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే సమాచారం సేకరిస్తున్నారు. అక్కడ విరిగిపడ్డ రాళ్ల మధ్య ఇంకొందరి మృతదేహాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీరంతా కర్ణాటక, మహారాష్ట్ర వాసులు కావడంతో పేర్లు, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, ఈ ప్రమాదం ప్రకృతి వైపరీత్యంగానే జరిగిందని సీఈ లింగరాజు తెలిపారు. ఈ మధ్యాహ్నం 2గంటల సమయంలో తీవ్రమైన గాలి దుమారం లేచిందని, అదే సమయంలో పిడుగుపాటుతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పిడుగు పాటుతో పేలుళ్ల కోసం అమర్చిన మందుగుండు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.

క్షతగాత్రులను హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. మృతులు, క్షతగాత్రులంతా బీహార్కు చెందినవారేనని చెప్పారు. మృతదేహాలకు నాగర్కర్నూల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం పూర్తికాగానే మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
మంత్రి పరామర్శ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగం వద్ద ప్రమాదవశాత్తు చనిపోయిన కూలీల కుటుంబాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా పాలెం హాస్పిటల్ లో మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. మృతిచెందిన ఒక్కో కూలీ కుటుంబానికి రూ. 14 లక్షలు పరిహారంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా గాయపడ్డ కూలీలకు వైద్య చికిత్సలు పూర్తి ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.












Click it and Unblock the Notifications