తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు: కేసీఆర్ కీలక నిర్ణయం, 50వేల టెస్టులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 237 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4974కు చేరింది. ఆదివారం మరో ముగ్గురు కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 185కు చేరిందని తెలిపింది.
జీహెఎంసీ పరిధిలోనే 195
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 195 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన ఒక్కరోజు కేసులతో పోల్చితే ఆదివారం అత్యధికంగా ఉండటం గమనార్హం.
ఐదు రోజుల్లో వెయ్యికిపైగా కేసులు
గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1054 కరోనా కేసులు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా 825 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకినవారిలో 4525 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా, 449 మంది వలస కార్మికులు, విదేశాల నుంచివచ్చినవారు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 2377 మంది డిశ్చార్జ్ కాగా, 2412 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక ప్రైవేట్ ల్యాబ్, ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు
కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. వైద్య ఆరోగ్య శా ఖ మంత్రి ఈటెల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షల విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రుుల్లో కరోనా పరీక్షలు, చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, చికిత్స, పరీక్షలకు ధరలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Recommended Video
జీహెచ్ఎంసీపైనే ఫోకస్.. 50వేల పరీక్షలే టార్గెట్
పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే పది రోజుల్లో 30 నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 4 జిల్లాల్లో ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పాజిటివ్ అని తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే చికిత్స అందించాలన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.