కరోనా: తెలంగాణలో తగ్గని వ్యాప్తి.. కొత్తగా 41 పాజిటివ్ కేసులు
లాక్ డౌన్ సడలింపులు ప్రకటించేనాటికి తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. సోమవారం కూడా కొత్త కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీలో 26, వలస కార్మికుల్లో 12, మేడ్చెల్ లో 3 కేసులతో కలిపి మొత్తం 41 కొత్త కేసులు వెల్లడయ్యాయి. దాంతో ఓవరాల్ గా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1592కి పెరిగింది.
సోమవారం మొత్తంగా 10 మంది డిశ్చార్జి అయ్యారు. తద్వారా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1002కి చేరింది. ప్రస్తుతం 556 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల సంఖ్య 34 కాగా, కొత్త మరణాలేవీ చోటు చేసుకోలేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గడచిన 14 రోజులుగా కొత్త కేసులేవీ వెలుగు చూడలేదు.
Recommended Video
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే కొత్తగా 5వేల పైచిలుకు కేసులు నమోదు కావడంతో టోటల్ ట్యాలీ 1లక్ష దాటేసింది. అందులో 39వేల మంది వ్యాధి నుంచి కోలుకోగా, 3,155 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 58 వేలుగా ఉంది. అంకెల విషయంలో రోజుకో రికార్డు చెరిగిపోతుండటం గమనార్హం. అయితే సోమవారం నుంచి భారీ ఎత్తున సడలింపులు అమలులోకి రావడంతో మున్ముందు ఏం జరగబోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది.