coronavirus:43 పాజిటివ్ కేసులు, 605 మందికి ఆస్పత్రిలో చికిత్స, 18 మృతి..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం 43 కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన మొత్తం కేసుల సంఖ్య 809కి చేరింది. వీరిలో 186 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 18 మంది చనిపోయారు. 605 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆదివారం నాటి క్యాబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. లాక్ డౌన్కు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని భావించినా.. కేసులు పెరుగుతున్న క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కూడా 31 కేసులు నమోదయ్యాయి. గద్వాల జిల్లాలో 7, సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య 43కి చేరింది.
మరోవైపు గచ్చిబౌలిలో కోవిడ్ ఆస్పత్రి మరో రెండురోజుల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో 1500 నుంచి 2 వేల మందికి వెంటిలేటర్పై చికిత్స అందించే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రులను కలిపి మొత్తం 5 వేల మందికి చికిత్స అందిస్తామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.