రక్తసిక్తమైన రోడ్లు: కరీంనగర్లో ఐదుగురు, ఖమ్మంలో చిన్నారి మృతి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం గాజులగండి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి చెందిన 14 మంది తుఫాను వాహనంలో గోదావరి పుష్కరాలకు కాళేశ్వరం బయలుదేరారు. గాజులగండి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను మంథని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెట్టును ఢీకొన్న కారు: చిన్నారి మృతి
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం ఉదయం ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఒంగోలు వాసులుగా గుర్తించారు. భద్రాచలం పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కొత్తగూడెం-భద్రాచలం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్
గోదావరి పుష్కరాల కోసం తొమ్మిదో రోజు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం-భద్రాచలం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సెలవులు లేకున్నా భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో భద్రాచలం వెళ్లే దారులు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ క్లియర్ విషయంలో అధికారులు చేతులెత్తేశారు.