షాక్: తెలంగాణలో 60 మంది ఐసిస్ సానుభూతిపరులు, వారిపై డైలమా
హైదరాబాద్: ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అరవై మంది వరకు ఐసిస్ సానుభూతిపరులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారి పైన ఓ కన్నేసి పెట్టాయి.
తెలంగాణలో ఐసిస్ సానుభూతిపరులు అరవై మంది ఉండగా, అందులో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఉన్నారని గుర్తించారు.
వీరి పైన కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. వీరే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం ఐసిస్ కార్యకలాపాలు గమనిస్తూ, తమ అభిప్రాయాలు పంచుకుంటూ, విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారి సంఖ్య వందల్లో ఉన్నట్లుగా తేలింది.
వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దాని పైన అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.దీనికి సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒక నివేదిక సమర్పించింది. ఐసిస్ దూకుడును అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో కొన్ని సూచనలు చేసింది.
ఐసిస్ ఉగ్రవాదంలో పాల్గొనేందుకు వెళ్తున్న 19మంది తెలంగాణ యువతీ యువకులను గుర్తించిన నిఘా వర్గాలు వారిలో పదహారు మందిని అదుపులోకి తీసుకోగలిగారు. మిగతా ముగ్గురు వివరాలు తెలియరాలేదు.
అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన మహ్మత్ అతీఫ్ వసీమ్ సిరియా యుద్ధంలో మరణించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన అతను, అక్కడి నుంచే సిరియా వెళ్లాడు.
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన సాఫ్టువేర్ ఇంజినీర్ మునవాద్ సల్మాన్ కూడా ఐసిస్ తరఫున పోరాడేందుకు ఇరాక్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐసిస్లో చేరేలా ప్రచారం నిర్వహిస్తున్న హైదరాబాదుకు చెందిన అఫ్సా జబీన్ను, ఆమె సహచరుడు సల్మాన్ మోహియుద్దీన్ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదుకు చెందిన మరో యువతి ఆరు నెలల పాటు ఐసిస్ తరఫున ఇరాక్లో పోరాడి వెనక్కి వచ్చింది. తెలంగాణకు చెందిన కొందరు యువకులు ఐసిస్ యుద్ధరంగంలో ఉండి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.