రంగంలోకి కేసీఆర్: కరోనాతో జాగ్రత్తంటూ సీఎస్కు ఆదేశాలు, రాష్ట్రంలో కొత్త కేసులు, మరణాలు ఇలా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్ల 77,930 నమూనాలను పరీక్షించగా.. 7754 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది.
తెలంగాణలో 80వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 2312కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 6542 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,62,160కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,507 కేసులు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో రెండ్రోజులపాటు వ్యాక్సినేషన్ నిలిపివేత
కాగా, రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉన్నందున రెండ్రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం, ఆదివారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉండదని, ఎవరూ వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు రావొద్దని తెలిపారు.
కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేసీఆర్..
ఇది ఇలావుండగా, కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రతి రోజూ మూడు సార్లు సమీక్షించి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా చికిత్సలు, పడకలు, ఔషధాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల విషయంలో ఎలాంటి సమస్యలు రాకూడదని స్పష్టం చేశారు. రెమిడిసివిర్ వంటి కరోనా మందులు, ఆక్సిజన్, పడకలు, వ్యాక్సిన్ల లభ్యత విషయంలో ఎలాంటి లోపం జరగకూడదని సీఎం తెలిపారు.
Recommended Video
ప్రత్యేక అధికారిని నియమించిన కేసీఆర్
ఇక నిరంతరం కరోనా పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖను ఈటెల రాజేందర్ నుంచి సీఎంకు బదిలీ చేయడం జరిగిన విషయం తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశాఖ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు కరోనాపై ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.