విషాదం: పుష్ప 2 తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్
Allu Arjun arrest: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన.. మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్.. బ్రెయిన్ డ్యామేజ్కు గురయ్యాడు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు.

డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ, డాక్టర్ విష్ణు తేజ్ పూడి పర్యవేక్షణలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నాడు. అత్యాధునిక వైద్య సహాయాన్ని అందిస్తోన్న నేపథ్యంలో కోలుకుంటాడని అందరూ భావించినప్పటికీ అది నెరవేరట్లేదు. సంఘటన చోటు చేసుకున్న ఈ నెల 4వ తేదీ నుంచీ కన్ను కూడా తెరవలేదా బాలుడు. ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ ఛొంగ్తు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం వాళ్లు కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. శ్రీతేజ్కు అందుతున్న వైద్య చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీవీ ఆనంద్ విలేకరులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టొచ్చని డాక్టర్లు వెల్లడించారని అన్నారు. ఇప్పటికీ వెంటిలేటర్పై చికిత్స అందిస్తోన్నారని తెలిపారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు చెప్పారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్పై ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత్ న్యాయసంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ అయింది. కొద్దిరోజుల కిందటే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు.












Click it and Unblock the Notifications