అగ్నిప్రమాదానికి వెనుక విస్తుపోయే కారణాలు - ఆ సమయంలో ఉక్కిరి బిక్కిరి..!!
ఎనిమిది మంది ప్రాణాలను బలి గొన్న సికింద్రాబాద్ అగ్నిప్రమాదం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిలో తొమ్మది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేసిన అగ్నిమాపక, పోలీసు అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం అక్కడ పరిస్థితి దయనీయంగా మరిందని చికిత్స పొందుతున్న క్షతగాత్రులు చెబుతున్నారు.

వాహనాల బ్యాటరీలు పేలడంతో
సెల్లార్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలడం వల్ల టైర్లు మంటల్లో కాలాయని.. ఆ టైర్ల నుంచి వచ్చిన విషయవాయువుల వల్లే పైన లాడ్జిలో ఉన్న వారు ఊపిరాడక మరణించినట్లు అధికారులు నిర్దారించారు. రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో కొనసాగుతోంది. మొదటి అంతస్తులో ఫైనాన్స్ సంస్థ, రిసెప్షన్ విభాగాలున్నాయి. తర్వాతి అంతస్తుల్లోని 25 గదులను అద్దెకు ఇస్తున్నారు. వాహన పార్కింగ్కు కేటాయించిన సెల్లార్లో విద్యుత్ ద్విచక్రవాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన 25 మంది 1-2 రోజులు ఉండేందుకు ఈ లాడ్జిలో బస చేశారు. సెల్లార్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి.. వాహనాలన్నీ కాలిపోయాయి. వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించింది. రెప్పపాటులో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

హాహాకారాలు చేస్తూ పరుగులు
అకస్మాత్తుగా భారీ పేలుడు శబ్దం.. తేరుకునేలోపు చుట్టూ దట్టమైన పొగలు.. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో చిమ్మచీకట్లు.. హాహాకారాలు చేస్తూ కిందకు దిగేందుకు ప్రయత్నించిన వారంతా పొగలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సెల్లార్లో ఎటువంటి అనుమతుల్లేకుండా స్కూటర్ల షోరూం నడుపుతున్నారు. ఆ భవనంలో అసలు అగ్నిమాపక నిబంధనలేవీ పాటించలేదని అధికారులు గుర్తించారు. రూబీ హోటల్, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలను రాజేంద్రసింగ్ బగ్గా, సుమీత్ సింగ్ నిర్వహిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజేంద్రసింగ్ బగ్గాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులు క్షతగాత్రులు పోలీసులకు వివరించారు. ఓ గదిలో ఉన్న నలుగురు వ్యక్తులు ఊపిరాడక కూర్చున్నచోటే కుప్పకూలారు.

విషవాయువులు దట్టంగా వ్యాప్తితో
ఆ నలుగురినీ రక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ అగ్నిమాపక, పోలీసు అధికారులు, స్థానికులు మంటలను అదుపు చేయటం, బాధితులను కాపాడటంలో నిమగ్నమయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల ఓవర్ ఛార్జింగ్ మంటలకు కారణంగా భావిస్తున్నారు. మంటల ధాటికి ఒక్కసారిగా బ్యాటరీలు పేలడంతో వాహనాల టైర్లూ అగ్నికి ఆహుతయ్యాయి. వాటి నుంచి వెలువడిన కార్బన్మోనాక్సైడ్, లిథియం విషవాయువులు దట్టంగా వ్యాపించాయి. దీనికి ‘మష్రూమ్ ఎఫెక్ట్' తోడవడంతో ప్రాణనష్టం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. పొగ కనిపించిన 12 సెకండ్లలోనే పేలుడు సంభవించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా అధికారులు అంచనా వేశారు. మరణించిన వారికి..క్షతగాత్రులకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి.












Click it and Unblock the Notifications