‘10’ కూడా పాస్ కాకుండానే పదేళ్లుగా డాక్టర్గా చెలామణి!
వరంగల్: సరైన విద్యార్హతలు లేకుండానే ఓ వ్యక్తి ఏకంగా పదేళ్లుగా వైద్యుడిగా చెలామణి అవుతుండటం జనగామ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. పదో తరగతి కూడా పాస్ కాని ఓ వ్యక్తి.. వైద్యుడిగా కొనసాగుతున్నాడని ఫిర్యాదులు రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పది పాస్ కాకుండా వైద్యుడిగా క్లినిక్ పెట్టేశాడు
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతాకు చెందిన ఆకాశ్ కుమార్ బిశ్వాస్ పదవ తరగతి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. అయితే, కొంత కాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు. ఈ క్రమంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి పదేళ్ల క్రితం వచ్చి వైద్యుడిగా చెప్పుకుంటూ ఓ క్లినిక్ ప్రారంభించాడు.
ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిక్ (ఐఏఎమ్) అనే బోర్డు తగిలించుకుని రోగులకు వైద్యం అందించడం మొదలుపెట్టాడు.
వేలాది మందికి వైద్యం.. కమీషన్ కోసం ఇతర ఆస్పత్రులకు
అల్లోపతి, ఆయుర్వేద మందులతో చికిత్స చేస్తున్నాడు. ఒక వేళ రోగికి ఇతడు ఇచ్చిన మందులతో వ్యాధి తగ్గక తీవ్రమైతే.. కమీషన్ ప్రాతిపదికన వరంగల్లోని వివిధ ఆస్పత్రులకు రేఫర్ చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఈ నకిలీ వైద్యుడిపై టాస్క్ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పోలీసులు అతడి క్లినిక్ లో సోదాలు నిర్వహించారు. ఎలాంటి అర్హత, అనుమతులు లేకుండానే ఇతడు వైద్యం చేస్తున్నాడని తేల్చారు. వివిధ పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆకాశ్ కుమార్ బిశ్వాస్ పై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ నకిలీ డాక్టర్ గత పదేళ్లలో 3650 మందికిపైగా రోగులకు వైద్యం అందించినట్లు పోలీసులు తెలిపారు. నెలకు సుమారు 30 మందికిపైగా రోగులకు వైద్యం అందిస్తున్నాడని చెప్పారు.
సర్జరీ లేకుండానే వైద్యం అంటూ మోసం
స్టేషన్ఘన్పూర్, స్టేషన్ఘన్పూర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ, స్టేషన్ఘన్పూర్ పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్ఫోర్స్ సిబ్బంది స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లిలో ఉన్న ప్రియాంక క్లినిక్లో తనిఖీలు చేశారు. ఆకాష్కుమార్ బిశ్వాస్ చెల్లుబాటు అయ్యే డాక్టర్, సంబంధిత వైద్య విభాగాల ధృవపత్రాలు లేకుండా క్లినిక్ను నడుపుతున్నట్లు గుర్తించారు. పైల్స్, ఫిషర్స్, బ్లీడింగ్ పైల్స్, ఫిస్టులా, హైడ్రోసిల్ వ్యాధులకు సర్జరీ లేకుండానే వైద్యం చేసే డాక్టర్గా చెప్పుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరికి కన్సల్టేషన్ ఫీజుగా రూ. 100 వసూలు చేసి, రోగులను మూడు-నగరాల్లోని వివిధ ఆసుపత్రులకు, డయాగ్నస్టిక్స్ సెంటర్లకు 'కమీషన్' ప్రాతిపదికన రిఫర్ చేసేవాడు.