ఇద్దరు యువతుల మధ్య ప్రేమ.. సహజీవనం! చివరకు హత్య
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాను ప్రేమించిన యువతిన మరో యువతి హత్య చేసింది.
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకుని సహజీవనం(living relationship) చేస్తున్న ఇద్దరు యువతుల మధ్య గొడవ జరగడంతో.. ఓ యువతి మరో యువతిని హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి(21) నెన్నెల మండలం మన్నెగూడంలోని తన అమ్మమ్మ ఇంటికి తరచూ వస్తూండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్ మహేశ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం నుంచి మంచిర్యాలలో అద్దెకు గది తీసుకుని మహేశ్వరి, ఆమె చెల్లి పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్ తోపాటు అంజలి కలిసి ఉంటున్నారు.
కాగా, గత పదేళ్లుగా మహేశ్వరి వస్త్రధారణ, ప్రవర్తన అబ్బాయిలా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మహేశ్వరి, అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. అంజలి స్థానిక కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తుండగా.. మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పనిచేసి ఇటీవలే మానేసింది.

ఇది ఇలావుండగా, మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్తో మహేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె చెల్లెలు, సోదరుడు, అంజలితోనూ ఆయనకు పరిచయం పెరిగింది. అయితే, ఈ క్రమంలో రెండు నెలలుగా అంజలి శ్రీనివాస్తో సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది. బుధవారం విధులు ముగించుకున్న అంజలి రాత్రి 8 గంటల ప్రాంతంలో గదికి వెళ్లింది. 10 గంటల సమయంలో మామిడిగుట్టకు వెళ్దామంటూ.. మహేశ్వరి బైక్పై అంజలిని తీసుకెళ్లింది. ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకు శ్రీనివాస్కు మహేశ్వరి ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని, తాను కూడా చేసుకుంటున్నాని చెప్పింది.
దీంతో వెంటనే శ్రీనివాస్.. పరమేశ్వరితో కలిసి కారులో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అంజలిని, స్వల్పంగా గాయపడిన మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అంజలి మృతి చెందింది. ఆమె మెడపై లోతైన గాయం ఉండటంతో మహేశ్వరి ఆమెను హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మహేశ్వరి పొట్ట, మెడపై చిన్నపాటి కత్తిగాట్లు మాత్రమే ఉండటంతో ఆమె ఆత్మహత్యాతయ్నం చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అంజలి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ ఆస్పత్రి ముందు ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహేశ్వరితోపాటు శ్రీనివాస్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications