వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తూ రోడ్డుప్రమాదంలో భార్యాభర్తలు మృతి, మరో ఇద్దరికి గాయాలు!!
ఎంతో సంతోషంగా దైవదర్శనానికి వెళుతూ, రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరులో చోటుచేసుకుంది. వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ కుటుంబం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. దీంతో వరంగల్ కాశిబుగ్గలో విషాదం చోటుచేసుకుంది.
కాశీబుగ్గకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరారు. మార్గమధ్యలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద కారును లారీ ఢీ కొట్టింది. హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలు ఇద్దరూ మరణించారు. మృతులు కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, మామిడాల సురేందర్ గా పోలీసులు గుర్తించారు.
ఈ రోడ్డు ప్రమాద దుర్ఘటనలో కారులో ఉన్న మరో ఇద్దరు మేఘన, అశోక్ గాయపడ్డారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా, తీవ్ర గాయాల పాలైన మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. మేఘన, అశోక్ లు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాద దుర్ఘటనలో భార్యాభర్తలిద్దరూ చనిపోయారని సమాచారం తెలియడంతో కాశిబుగ్గలో విషాదం అలుముకుంది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎంతగా చెబుతున్నా వాహనచోదకుల నిర్లక్ష్యం ఎంతోమంది నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల వల్ల తీరని దుఃఖంలో మునిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి, జాగ్రత్తగా వాహనాలు నడిపితే కొంత మేరకు రోడ్డు ప్రమాదాలను నివారించే వీలుంటుంది. లేదంటే ఇలా కుటుంబాలకు కుటుంబాలే రోడ్డు ప్రమాదాలలో బలైపోయే ప్రమాదం కనిపిస్తుంది.